పేజీలు

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

లెటర్స్ టు లవ్

కొన్నాళ్ల క్రిందట... కాదు కాదు కొన్నేళ్ల క్రిందట... 

వార్తాపత్రికలో ఒక అమ్మాయి ఫోటో చూసాను. పాతకాలపు స్త్రీత్వాన్ని ఆ కాలపు దుస్తుల్లోనే మూటకట్టి తెచ్చి సముద్రపు ఒడ్డున కూరబెట్టినట్టు ఉంది ఆమె. మొహం చూస్తే చిన్నతనపు అల్లరి మానేసి, బుద్ధిగా లోకాన్ని చదవడానికి కూర్చున్న కాలేజీ పిల్లలా ఉంది. మొత్తానికి పాత, కొత్తల యుద్ధంలో ఎగురుతున్న జెండాలా ఉంది.  తీరా చూస్తే ఆ పిల్ల ఒక పుస్తకం కూడా రాసేసింది అని ఆర్టికల్ చదివాక తెలిసింది. పుస్తకం పేరు 'లెటర్స్ టు లవ్'...  ఆ అమ్మాయి పేరు కడలి సత్యనారాయణ. ఆ పుస్తకం కవర్ పేజీ మీద కూడా అదే ఫోటో ఉంది. పుస్తకం వెంటనే చదవాలనే ఆసక్తి పెరిగింది.  

నేను పుస్తకాలు చదవడం మానేసి ఏళ్లవుతోంది. అయినా సరే ప్రతి ఏడాది బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్లి పుస్తకాలు కొంటూ ఉంటాను. ఏనాటికైనా వాటిని చదువుతాననే ఆశ. బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్లి 'లెటర్స్ టు లవ్' కావాలన్నాను. స్టాక్ అయిపోయింది సార్. మూడు రోజుల తర్వాత రండి అన్నారు. ఇంత  డిమాండ్ ఏంటని ఆశ్చర్యపోయాను. తర్వాత వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో చెప్పి తెప్పించుకున్నా. 


ప్రేమకు ప్రేమలేఖలు... 

చలం పుస్తకాల్లో నేను చదివిన మొదటి పుస్తకం 'ప్రేమలేఖలు'. ఆ తర్వాత ఆయన సాహిత్యాన్ని వదల్లేక పోయాను. అటువంటి నాకు ఈ ప్రేమలేఖ నచ్చుతుందా? అనుకున్నా.  కానీ ఈ తరం ప్రేమను ఎలా అర్థం చేసుకున్నదో  తెలుసుకోవాలనిపించింది. అందుకే పుస్తకం చదవడానికి నిర్ణయించుకున్నా. కానీ ఎప్పటి మాదిరిగానే, మిగతా పుస్తకాల దొంతరలో ఈ పుస్తకం కూడా నా లైబ్రరీలో అలంకార వస్తువులా ఉండిపోయింది ఇన్నాళ్లూ. ఎలాగైతేనేం ఈ మధ్య చదవడం కుదిరింది. నాకు బాగా నచ్చింది. ఈ అమ్మాయి మామూలుది కాదు. పేరుకు తగ్గట్టే కడలి. 


'లెటర్స్ టు లవ్'  పుస్తకం చదివాక అందులో నాకు బాగా నచ్చిన భావాలను, కడలి రాతలను నలుగురితో పంచుకోవాలనిపించింది. అందుకే వాటిని ఇక్కడ ఉంచుతున్నా. పుస్తకంలో ఒక్కో శీర్షిక కింద ఒక్కో లేఖ ఉంటుంది. ఆ శీర్షికలను కూడా ఇక్కడ ఇచ్చాను.                
  
  


Chalam's kind of evening

మన చలం అంటాడు - అప్పుడే ఏడ్చి నవ్వే ఆడవాళ్ళ మొహాలు ఎంత అందంగా ఉంటాయంటే, వర్షం కురిసి వెలిసాక కాసే నీరెండంత అందంగా ఉంటాయని. అచ్చు అలాగే నీరెండ కాస్తోంది. 

Waiting...

ఎంత పిచ్చిది ఈ మనసు! భలే మొండిది కూడాను. ఏదో వైపు నుంచి దరిచేరే ప్రేమని, ప్రేమే కాదంటుంది. తాను కోరుకున్నవైపు నుంచి వస్తేనే ప్రేమంటుంది. అలా వచ్చి పడే ప్రేమని ఒప్పుకోగలిగితే ప్రపంచం అంతా ప్రేమమయం అయిపోదు!     

Clouds pass

సన్నని జల్లు ఒంటిపైన కురుస్తున్నా, పక్షులు అలా చినుకు స్పర్శని మోస్తూ ఎలా ఎగురుతూ పోతాయో, అలా ప్రేమజల్లు మన పైన నిరంతరం కురుస్తూ తన ఉనికిని  గుర్తు చేస్తూ ఉంటే బావుండు. మనుషులమనీ, ప్రేమకే పుట్టామనీ, ప్రేమ కోసమే బతకాలనీ, చినుకు పడిన ప్రతిసారీ వెన్నుతట్టి వాన గుర్తుచేస్తేనైనా ప్రేమకీ వికృత రూపం రాకుండా ఉండేది 

మట్టి తాకి మలినమయ్యే వరదలున్నాయిగానీ, నేలనంటనంత వరకు వాననీరంతా స్వఛ్ఛమేగా. ప్రేమ పుట్టుక వానజల్లు లాంటిదే కానీ ఇరుకు మనసుల మధ్య ఇమడలేక మరకగా మారినట్టుంది  

The Sea and a Butterfly 

ఎంతమందో తీరాన కూర్చొని ప్రేమిస్తుంటారు గానీ నాతో బతకడం కష్టం. నేనూ  బతకనివ్వనులే.    

The last letter

నన్ను దేవత అని ఎలా అంటావు? నిజంగానే ఇష్టంతో గుడిలో ఉండే దేవతలున్నారా? నువ్వన్నట్టు వాళ్ళకి చీరెలు, సారెలు అంటగట్టి ఆ గదికి అంకితం చేసారు ఈ జనాలు. 

Love happens under trees, You know?

ప్రేమలో ఉండటం ఎంత కష్టంగా మారిన రోజులివి! ప్రేమలో పడటం, లేవడం పనిగా మారిపోయిన తరం ఇది. ఇలాంటి రోజుల్లో ఆకాశాన్ని చూడటం, సూర్యుడు, చంద్రుడి రాకపోకలని గమనించి, ప్రేమించడం. వాళ్ళ కిరణాలతో కబుర్లాడటం, వానజల్లులతో స్నేహం, రాత్రులతో ప్రేమలేఖలు, మనుషుల్లో మనిషి తడి వెదుక్కుంటూ పోయే గుణం ఉండటం అంటే బతకడమేగా. బతుకుతున్నామంటే ప్రేమించకుండా ఎలా ఉంటాం?

Okay! I'll leave now...     

ఈ మొత్తం ప్రపంచంలో నాకు నేనంటేనే ఇష్టం, నేనంటేనే ప్రేమ. భరించలేనంత ప్రేమ. ఇప్పుడా ప్రేమలో నువ్వెక్కడ కలిసిపోతావో అని భయంగా ఉంది. ఇప్పుడా ప్రేమే నువ్వుగా ఎక్కడ కనిపిస్తావో అని గుబులుగా ఉంది. 

Just Imagine       

ఈ ఊహల్లో నా ఊపిరి బరువెక్కడం నాకే మహా నచ్చుతోంది.    

ప్రేమ తెలియని వాళ్ళంటారు... గగుర్పాటు భయపడినప్పుడే వస్తుందని. కానీ వెంట్రుకలు నిక్కబొడుచుకోడం ఇప్పుడు ఇలా (ప్రేమ భాగస్వామితో ఉన్నప్పుడు) కూడా జరగొచ్చు. నరాల్లో వేడుకలవడం, ఊపిరి రంగులు పీల్చడం, ఊహల్లో పువ్వు నవ్వులు నవ్వడం... ఇవన్నీ జరుగుతాయని నేననుకోలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి.  

Love is Freedom

ప్రేమంటే కట్టిపడేసుకోవడం అనే భ్రమలో నిన్ను కోల్పోవడం కన్నా, ప్రేమంటే స్వేఛ్చ అనే నిజంలో ప్రేమించడం వేరు 

This is not happening!

ప్రేమ ఎన్ని అగాధాలనైనా భరించగలదు అంటాంగానీ కానేకాదు. కొద్దిపాటి ఎల్యూడ్ చేయడమో, ఇగ్నోర్ చేయడమో, ఓవర్ లుక్ చేయడమో జరిగినా మెల్లిమెల్లిగా గోడల పెచ్చులు పగిలినట్టు పగులుతూ పోతుంది 


This is what I wanna right about 


సిగ్గుని ఓ మూలకి నెట్టి చెప్తున్నాను పిల్లడా ! నువ్వు విను. నువ్వు పిలిస్తే మేని వీణని మునిపంటితో మీటినట్టు ఉంటుంది. పెదాల మీద చక్కెర పలుకులంటించి అణువణువుకి చిటికెడు ముద్దులిచ్చుకుంటూ పోయినట్టు, ఒళ్ళంతా చక్కెర పాకం ఊరినట్టు, ఊరీ ఊరీ పంచదార ఊబిగా మారినట్టు, తనువంతా తీపి వాసన. 

కాయమంతా చీమలు ముసిరినట్టు మళ్ళీ రకరకాలుగా పిలుస్తూ నువ్వే, సుతారంగా కుట్టి నొప్పి పుట్టిస్తావు. ఆ పైనేమో బుగ్గలు దాటి, పెదవులు మీటి, మెడ వంపుల మీదుగా అరవిరిసిన పువ్వులన్నిటినీ కోసుకుంటూ, సూరీడు కనని నిధి చేరగానే ఎర్రతనమంత మత్తుగా మారి కనుకొనల్లో నుండి ఆనంద జలపాతం పారుతుంది. 

సొరంగ సిరులను దోచే దొంగాడికి శ్వాసందక తల పైకెత్తి ఊపిరి పీల్చుకున్నట్టు, ఒక నిమిషం సముద్ర తీరాన సేద తీరుతావు. వదులులు బిగువులవుతాయి. బిగువులు ముడులవుతాయి. మళ్ళీ ముడులను పొరలు పొరలుగా విప్పుకుంటూ నువ్వే, నీ జ్వాలే. 

జన్మాంతం పొందే ఆనందాన్ని పదాలలో ఇమడ్చలేక ఒదిలేస్తున్న నిస్సహాయ స్థితి నాది. అసంపూర్ణిత మాటలివి. 

Sky told me a story

ఈ ఆకాశం ఎంత గడుసుదో కదా! మనిద్దరి గడుసుదనం కలిపినంత గడుసుది. ఎన్నెన్ని వేషాలు వేసి నాకు నిన్ను చూపుతుంది. 


నేలనంబాడే నెలల పిల్లాడినీ  
అప్పుడే నిక్కర్లు వేసుకు సైకిల్ తొక్కే బుడ్డోడినీ  
నూనూగు మీసాల పాల బుగ్గలోడినీ
పుస్తకాలు మోసుగు తిరిగే చదువరినీ 
పిడికిలి బిగించి నినాదమయ్యే యువకుడినీ 
కంగారుగా పరుగెత్తే కొత్త ఉద్యోగినీ 
తాపీగా పేపర్ చదివే నడివయస్కుడినీ  
తల నెరసి బోసినవ్వులు నవ్వే నిత్య యవ్వనుడినీ 


ఇంతమందిని ఒక్కొక్కరిగా చూపుతుంది. ఇంతమందిలోనూ నిన్నే పట్టి పట్టి చూపిస్తుంది. 

Love found me this time 


ఎన్ని రోజులైంది నిన్ను చూసి. మూడు సంవత్సరాల ముందు నిన్ను మొదటిసారి చూసినప్పుడు గుండెలో ఎలా సీతాకోకచిలుకలు అల్లరి చేశాయో అలాగే అల్లరి చేసాయి.    
  

Never go back to something that broke you


ఆ పావుగంటలో నీ కళ్ళు ఈ మూడు సంవత్సరాలు నువ్వు నన్ను ఎంతగా కోల్పోయావో చెప్తుంటే, నా కళ్ళు మాత్రం ఈ మూడు సంవత్సరాలు నేనెంత బండరాతిగా మారిపోయానో చెప్తుంటాయి 

kisses

కొన్నిసార్లు నీ నవ్వులని నేను నా నడుము మీద అనుభవిస్తుంటాను. కొన్నిసార్లు చెవి వెనుక చిరుగాలిలా ఫీల్ అవుతాను. ... నువ్వు కనురెప్పలెత్తిన ప్రతిసారీ రెప్పలతో పాటే బట్టలు విప్పేసినట్టు ఉంటుంది.    
  
---------------------

నా కథ నచ్చిందంటే నేను కూడా నచ్చి ఉంటాను.
 
ఇంటర్ మీడియట్ లవ్ లో - ఫిజికల్ ప్రెజెన్స్ మాటర్స్                         

                             
   

2, మే 2020, శనివారం

ఓ మనిషీ... నీ గుండెను తడిమి చూడు!


కొత్త కొత్త ఆవిష్కరణల కోసం 
కొత్త కొత్త అనుభవాల కోసం
సంపాదన కోసం , సంసారం కోసం    
మనసును మత్తెక్కించే క్షణాల కోసం...

తూటా వేగంతో పరుగులు పెడుతున్న నన్ను 
ఆపిన వింత ఆకారాన్ని చూసి అలవాటుగా 
'హలో' అంటూ చేయి కలపబోయాను. 
అది మాత్రం చేతులు జోడించి 
'నమస్కారం' అని సంస్కారం నేర్పింది 
అది దొర్లుకుంటూ ఆలా వెళ్ళిపోతుంటే 
దాని ముందు భూగోళమే చిన్నదైపోయింది

కంటికి కనిపించని మాయలాంటి 'అది' 
వామనుడంత విశ్వరూపమై 
నా అహం మీద మూడో అడుగు పెట్టింది
నా చుట్టూ, నా ఇంటి గోడలనే కాపలా పెట్టి 
నన్ను బందీని చేసింది 

నేను ఇప్పుడే సరిగా ఆలోచిస్తున్నాను 
సాటిమనిషి ఇన్నాళ్ళూ నాకు ఏమిచ్చాడో తెలుస్తోంది 
నా కుటుంబానికి నేనేమిచ్చానో తెలుస్తోంది 
ఖాకీ కరకుదనం, తెల్లకోటు దర్పం మాటున 
కనిపించని వృత్తి'ధర్మం' తెలిసొస్తోంది
మంచుతో కడిగినట్టు ప్రకృతి మలినం 
లేకుండా స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది 

ఇదే సమయంలో...  
సొంతూరు బాటలో నడిచీ నడిచీ 
ప్రాణాలొదిలిన ఓ చిట్టితల్లి..
సమాజానికి, కరోనాకు పరీక్షపెట్టి 
కరుణకలిగిన వారెవ్వరని ప్రశ్నించింది. 
పళ్ళెం, గరిట పట్టుకుని ఓ పేదరాలు  
గణగణ మంటే దేశభక్తి అని మురిసిపోయా. 
'నా ఆకలి సంగతేంటి' అని ప్రశ్నిస్తోందని 
ఆలస్యంగా అర్థమైంది 

కరోనాకు నువ్వింకా భయపడుతున్నావా? 
అది నీకు ఏది ముఖ్యమో చెప్పేందుకు వచ్చింది
మానవత్వం అన్న ఒక్క ముక్కను చేతబట్టి 
దేశాలను, నగరాలను, ఇంటింటినీ తట్టి 
చిరునామా అడుగుతోంది

మానవత్వపు జాడ ఉందేమో! 
ఓ మనిషీ... నీ గుండెను తడిమి చూడు!   

22, మే 2019, బుధవారం

శ్రావణి, సారా, లహరి, పూజ ... ఎవరీ అమ్మాయిలు?

 
మజిలీ, చిత్రలహరి, జెర్సీ, మహర్షి... ఇవి ఈ మధ్య తెలుగులో విజయవంతమైన చలనచిత్రాలు. మహర్షి సినిమా 'విజయం' గురించి మాట్లాడితే... మిగిలిన  సినిమాలు 'ఓటమి'ని అధిగమించడం లేదా ఓటమి బాధ నుండి బయటపడటం గురించి మాట్లాడాయి. ఈ రోజుల్లో యూత్ ని ఆకట్టుకుంటేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అలాంటిది ఈ సినిమాల్లో యూత్ ని అంతగా ఆకట్టుకున్న అంశాలు ఏమున్నాయి అంటే... అవే!... గెలుపు ఓటములు.
 
అవును! నేటి యువత నిత్యం గెలుపు కోసం పోరాడుతోంది. ఇటు సమాజం కానీ.. అటు ప్రభుత్వం కానీ, రాజకీయాలు కానీ యువతను పట్టించుకోవట్లేదు. మారిన సామాజిక పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీ నేపథ్యంలో కేవలం బతకడం మాత్రమే కాదు... 'అంతకు మించి' కోరుకుంటోంది యువత. అందుకోసం తమ ఉనికిని చాటుకోడానికి, కాపాడుకోడానికి సర్వశక్తులు ఒడ్డి నిత్యం పోరాడాల్సివస్తోంది. ఇందులో ఓడిపోతున్న వారే ఎక్కువ. అందుకే మజిలీ, చిత్రలహరి, జెర్సీ చిత్రాల్లో జీవితంలోనూ, కెరీర్ లోనూ ఓడిపోయిన హీరోల్లో తమను తాము చూసుకున్నారు. ఇక మహర్షి సినిమాలో రిషిలో తమ భవిష్యత్తును చూసుకున్నారు. ఈ సినిమాలు విజయవంతం కావడానికి ఇదే కారణం. 

కానీ మన టాపిక్ అది కాదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని నానుడి. అంటే అతని విజయానికి కారణం ఆమె సహకారం అని అర్థం. అదేం కాదు.. అమ్మాయిలెప్పుడూ విజేతలైన మగాళ్ల వెనుకే పడతారు కాబట్టి ఆ సామెత వచ్చిందని జోకులు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఈ నాలుగు సినిమాల్లోని మగాళ్ల వెనుక ఉన్న ఆడవాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 

మజిలీ:


ఇందులో పూర్ణ జీవితంలో అన్షు, శ్రావణి (ఈ పాత్రను సమంత అద్భుతంగా పోషించింది) అనే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఏ మగాడి జీవితంలో అయినా తొలిప్రేమలో అన్షులాంటి అమ్మాయి ఒకరు ఉండటం కామన్. ఆ ప్రేమ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఈ రోజుల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అసలు నేటి యువతకు ప్రేమలో ఆవేశాన్ని తప్ప ఆనందాన్ని వెదుక్కునే సమయం దొరకడంలేదు. అలాంటిది ఇక్కడ పూర్ణ మాత్రం దాన్నొక కారణంగా చూపించుకుంటూ బాధ్యతా రాహిత్యంగా తిరుగుతుంటాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది శ్రావణి గురించి. భర్త ఏదైనా సాధించాలి అని తపిస్తున్నప్పుడు తాను సహకరించడం, బాధ్యత తీసుకోవడం కరెక్టే గానీ.. ఆ భర్త పనీపాటా లేకుండా తిరుగుతుంటే... ప్రేమ అన్న మాటకు, అది కూడా వన్ సైడ్ లవ్ కి... ఈరోజుల్లో అమ్మాయిలెవరైనా శ్రావణిలా కట్టుబడి ఉంటారా? అని అడిగితే సందేహమే సమాధానం. ప్రేమ పేరున అబ్బాయిలతో విచ్చలవిడిగా ఖర్చు చేయించే గడుసు అమ్మాయిలు ఉన్న ఈరోజుల్లో ఏమాత్రం సంపాదన లేని ఒకతని కోసం ఒకమ్మాయి కష్టాల్లో బతకడానికి సిద్ధపడుతుందా అన్నది నమ్మశక్యం కాదు.     
'పేదవేళ జూడు పెండ్లాము గుణమును...' అన్నాడు వేమన.  

గడనగల మగనిఁజూచిన
నడుగగడుగున మడుఁగులిడుదు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
అంటే...  స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు అన్నాడు సుమతీ శతకకారుడు. ఇది శతాబ్దాల క్రితమే...   స్త్రీలు మగాడి సంపాదన మీద ఆధారపడి వున్న రోజుల్లోనే చెప్పిన మాట. అలాంటిది తనకు తాను సంపాదించుకుంటూ ప్రతి స్త్రీ ఆర్థిక స్వతంత్రతను పొందిన ఈ రోజుల్లో సంపాదన లేని మగాడిని గౌరవించే స్త్రీ ఉంటుందనుకోవడం సినిమాటిక్.. అంతే!    

తాను ఇష్టపడ్డ మగాడి కోసం ఎంతకైనా తెగించే అమ్మాయిలను ప్రతిరోజూ పేపర్లలో చూడట్లేదా అంటే... నిజమే..  కానీ ఆ తెగింపు నచ్చిన వాడితో సుఖపడేందుకు చేస్తున్నారు తప్పితే, కష్టపడేందుకు కాదు. అందుకే శ్రావణి పాత్ర ఈరోజుల్లో ఒక ఊహా. ఆ ఊహే నిజమై, ప్రతి మగాడి వెనుక ఒక శ్రావణి ఉంటే ప్రతి మగాడు విజేతే. ప్రతి ఇల్లు స్వర్గసీమే. 

జెర్సీ: 

క్రికెటర్ గా అర్జున్ ని అభిమానించిన సారా (ఎంతో బరువైన ఈ పాత్రను శ్రద్ధా శ్రీనాథ్ పోషించి మెప్పించింది) అతన్ని ప్రేమించి, తండ్రిని ఎదిరించి మరీ పెళ్లిచేసుకుంది. కానీ అర్జున్ కొన్ని కారణాల వల్ల క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తాడు. చేయని నేరానికి అతని ఉద్యోగం కూడా పోయింది. అర్జున్ లో సారా ఏవి చూసి ఇష్టపడిందో అవిప్పుడు లేవు. క్రికెట్ స్టార్ ఇమేజి లేదు, తనను మురిపించిన చిలిపితనం లేదు, డబ్బు లేదు, సంతోషం లేదు. పెళ్లిచేసుకుంది కాబట్టి కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం ఇష్టం లేకున్నా ఉద్యోగం చేస్తోంది. ఒక అసంతృప్తికరమైన జీవితం అనుభవిస్తోన్న సారా మనస్తత్వాన్ని చాలా సహజంగా, వాస్తవికతకు దగ్గరగా చూపించారు. అర్జున్ లోని క్రికెటర్ ని చూసిందే తప్ప అతనిలోని నిజాయితీని చూడలేదు సారా. అందుకే లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోమంది. నీ ఉద్యోగం వస్తే నేను ఉద్యోగం మానేస్తాను అంది. అంటే సంపాదన నీ పనే కానీ నాది కాదు అని భావం. మజిలీలో శ్రావణికి, జెర్సీలో సారా పూర్తి భిన్నం. మొగుడి నుంచి సుఖాన్ని మాత్రమే  కోరుకున్న సారా అవి తనకు దక్కకపోయేసరికి అతన్ని అర్థం చేసుకోవడం అనవసరం అనుకుంది. డబ్బు లేదు కాబట్టి సంసారంలో సుఖం కూడా లేదనుకుంది. నేటి సగటు మహిళ మనస్తత్వానికి అచ్చమైన పాత్ర సారా. భార్య ఇలాంటిది అయినప్పుడు మగాడు సాధించడం, గెలవడం అనే పెద్ద పెద్ద మాటలు పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించి, నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఉత్తమం. ఇలాంటి సంసారాల్లో ముందు జాగ్రత్త, పొదుపు అనేవి చాలా అవసరం. 

చిత్రలహరి : 

విజయ్ కి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ, ఆ లక్ష్యం కోసం ఎంత ప్రయత్నించినా ఫెయిల్యూరే. అలాంటి లూజర్ కి లహరి (కళ్యాణి ప్రియదర్శిని) అనే అమ్మాయి ప్రేమ దక్కడం నిజంగా విజయమే. కానీ ఆ లహరి కేవలం తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆలోచించడం విజయ్ కి మరో ఫెయిల్యూర్. తనవైపు నుంచే ఆలోచించడం, తాను అనుకున్నట్టే  భాగస్వామి ఉండాలనుకోవడం ప్రేమ కాదు స్వార్థం. ఈ లహరి పాత్ర పెళ్ళయ్యాక జెర్సీ సినిమాలోని సారా అవుతుంది. మగాడు 'ఐ లవ్యూ' అని చెబితే ఇక అతను ఎప్పుడూ తనకు అనుకూలంగా నడుచుకోవాలి. తన కోసమే బతకాలి. తన సుఖం కోసం కష్టపడాలి అనుకునే అమ్మాయిలలోని సహజ స్వార్థం ఈ లహరిలో కూడా ఉంది. ప్రేమ పెళ్ళి చేసుకుని ఐదేళ్ళు తిరక్కుండా విడాకుల వరకు వెళ్ళేది లేదా మా ఆయన మారిపోయాడంటూ మరో వ్యక్తికి దగ్గరయ్యేది ఇలాంటి వాళ్ళే. వీళ్ళకు మొగుడి లక్ష్యాలతో పనిలేదు.

మహర్షి: 

నిజం చెప్పాలంటే...  ప్రేమించినన్నాల్లూ ప్రేమించి పెళ్ళి అనగానే మొహం చాటేసే రిషి పాత్రలోని విలనిజాన్ని, స్వార్థాన్ని మహర్షి సినిమా చూసిన ప్రేక్షలెవరూ గుర్తించలేదు. ప్రేక్షకుడిలో ఈ ఆలోచన వచ్చీ రాకముందే అంతకంటే ముఖ్యమైన మరో ఎమోషన్ సీన్ లోకి లాక్కెళ్ళిపోయాడు దర్శకుడు. ఈరోజుల్లో రిషిలాంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళ దృష్టిలో ప్రేమ కొంతకాలం వరకే. టైం పాస్ కొరకే. జీవితాంతం వరకు కాదు. అలాగే రిషిని ప్రేమించిన పూజ కూడా అతని  సక్సెస్ నే ప్రేమించింది. కనీసం అతని అభిప్రాయం కూడా తెలుసుకోకుండా.. అలాంటి సక్సెస్ ఫుల్ పర్సన్ ని పెళ్ళిచేసుకుని పెరట్లో  కట్టేసుకుందామనుకుంది. ఆమె స్వార్థం ఆమె చూసుకుంటే, అతని స్వార్థం అతను చూసుకున్నాడు. ఆ తర్వాత ఎవరికీ ఏదీ కానట్టు, ఎవరి జీవితం వారు చూసుకున్నారు. ఇది నేటి సమాజం తీరును ప్రతిబింబిస్తోంది. రిషి చేసింది కరెక్ట్. విజయం సాధించాలంటే   పూజలాంటి అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి.                      

ముగింపు: శ్రావణి, సారా, లహరి, పూజ... ఈ నలుగురిలో ఏ ఒక్కరిలాగో అమ్మాయిలు ఉండకూడదు. పెళ్ళికాక ముందు లహరిలా ఉండాలి. ప్రేయసిగా ఆ స్వార్థం ముద్దుగానే ఉంటుంది. పెళ్ళవుతూనే శ్రావణిలా మారిపోవాలి. ఇది కుటుంబ అభివృద్ధికి తోడ్పతుంది. పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగాక సారా పాత్రలోకి వెళ్ళిపోవాలి. పూజలా ఎప్పుడూ ఉండకూడదు. ఏమంటారు?      

                               

11, మే 2019, శనివారం

అమ్మకు వందనం


తల్లిని గౌరవించడానికో, ఆమె ప్రాధాన్యం గుర్తించడానికో ఏడాదికో రోజు పెట్టుకోవడం ఏమిటి? మిగతా రోజుల్లో తల్లి.. తల్లి కాదా అంటూ కొంతమంది ఆగ్రహిస్తుంటారు. ఏ వ్రతం చేసినా, ఏ పని తలపెట్టినా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం, తలచుకుంటాం. అయినా ఏడాదికోసారి వినాయక చవితి జరుపుకోవడం దేనికి? అసలు నిత్యం దేవుడిని తలచుకునే మనం పండుగ రోజున ఫలానా దేవుడిని పూజించడం దేనికి? దేనికంటే... ఏ పనినైనా సామూహికంగా చేయడం వలన అదొక సంప్రదాయం అవుతుంది. ఒక సంస్కృతి అవుతుంది. అలాగే అంతర్జాతీయ మాతృ దినోత్సవం కూడా. 


నిత్యం మనకు అమ్మ అందించే ప్రేమను, సేవను మరొక్కసారి సామాజికంగా గుర్తుచేసుకుని, అమ్మ ప్రాధాన్యాన్ని సమాజానికి తెలియచేయడం కోసం ఈ మదర్స్ డే. దీనివల్ల అమ్మకు ఒరిగేది ఏమీలేదు. తాను ఎంతో ఇష్టంగా నెరవేర్చే బాధ్యతను... బరువుతో పోల్చి...  మోసినందుకు పతకాలిస్తామంటే అమ్మ నవ్వుతుంది. అందుకని మదర్స్ డే అమ్మ కోసం కాదు. అమ్మ స్థానాన్ని గౌరవించడం కోసం. 

చెప్పాలంటే అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని మరింత బాధ్యతాయుతంగా, మరింత ఉదృతంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యవ్వనభారంతో కన్నుమిన్ను కానరాక అనుకోకుండా తల్లయిపోయి వద్దనుకున్నా ఒడిలో కొచ్చిన బిడ్డని అమానుషంగా నడిరోడ్డున ఏ చెత్త కుప్పలోనో, ముళ్ళ పొదల్లోనో విసిరేసే యువతికి, తాను విసిరేసింది ఒక రక్తమాంసాల ముద్దను కాదని తెలియాలి. ప్రియుడితో కలిసి ఉండేందుకు అడ్డొస్తున్నారని పిల్లలని కడతేర్చే తల్లికి అమ్మతనం అంటే ఏమిటో తెలిసిరావాలి. ప్రియుడి కోసం భర్తను చంపి, జైలుపాలయ్యే మహిళకు పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచన రావాలి. పంతాలు, పట్టింపులతో కాపురాన్ని కాదనుకుని విడాకులకు పరుగెత్తే ముందు పిల్లల మనసులపై అవి చూపించే ప్రభావం ఏమిటో అర్థం కావాలి. ఇవన్నీ తెలిసిరావాలంటే పిల్లల కోసం అపూర్వ త్యాగాలు చేసిన అమ్మ కథలను సమాజం వినాలి. అందుకైనా మాతృ దినోత్సవం జరుపుకోవాలి. 

దేశమేదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా...  దేవుడు ఉన్నా లేకున్నా 'మాతృత్వం' ఉంది. జీవకోటికి ఇది ప్రకృతి ఇచ్చిన మహోత్తరమైన వరం. ఆ వరానికి ప్రతిరూపమే ప్రతి ఇంటా కొలువుదీరిన 'అమ్మ'. కన్ననాటి నుండి కనుమూసే వరకు తన బిడ్డల సంరక్షణ, పోషణ, శిక్షణ బాధ్యతలను 
ఇష్టంగా మోస్తూ, సమాజ వికాసానికి, మానవజాతి మనుగడకు ఆధారంగా నిలిచే శక్తి స్వరూపిణి 'అమ్మ'.
ఇండోనేషియాలో అమ్మకు పాదపూజ 
అమ్మకు పాదపూజ చేస్తే స్వర్గానికి వెళ్తామని ఇండోనేషియా ప్రజలు నమ్ముతారు. అలాంటి నమ్మకాలు మన సమాజంలోనూ ఏర్పడాలి. 


మదర్స్ డే రోజున చాలా ఛానెళ్లలో హీరోయిన్స్..  వాళ్ళ అమ్మల గురించి చెప్పే కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి. దాని బదులు కూలి పనికి బిడ్డను చంకన పెట్టుకు వెళ్ళి, అక్కడ ఏ చెట్టుకో చీరను ఊయలగా కట్టి అందులో బిడ్డను ఉంచి... పనిచేస్తూ పదేపదే ఆ ఊయల వంక చూసే తల్లి గురించి ఎందుకు చెప్పరు? ఎందరో బిడ్డల్ని తల్లుల నుంచి వేరుచేసి...  వారిని బిక్షాటన కోసం ఉపయోగిస్తున్న మాఫియా గురించి ఎందుకు చెప్పరు? అన్ని ప్రైవేటు సంస్థలూ మెటర్నిటీ లీవులు ఇస్తున్నాయా లేదా ఎందుకు చర్చించరు? నేటి పరుగుల ప్రపంచంలో తల్లికి బిడ్డల బాధ్యతతో పాటు చాలావరకు కుటుంబ పోషణ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవి మాతృత్వంపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి? అమ్మ సంతృప్తిగా ఉంటుందా? పురాణ పురుషుల గురించి చెప్పి తల్లి జిజియాబాయి బాల  శివాజీని వీరునిగా, ధర్మవర్తనుడిగా తీర్చి దిద్దింది. మరి టీవీలు, సెల్ ఫోను గేములు వచ్చిన ఈ తరంలో పిల్లలకు నేటి తల్లి ఏం నేర్పిస్తుంది? అసలు తల్లీ బిడ్డల అనుబంధంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇలాంటివన్నీ మదర్స్ డే రోజున అయినా చర్చకు రావాలి. తల్లిని పూజించడం తర్వాత... ముందు తల్లికి ఉన్న సమస్యలను కనుక్కోవాలి కదా. ఆమె మనోభావాలను అర్థం చేసుకోవాలి కదా! 
                          
ఏపీ బడుల్లో అమ్మకు వందనం 
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 'అమ్మకు వందనం' అనే కార్యక్రమాన్ని పెట్టి బడుల్లో పిల్లల చేత తల్లుల కాళ్ళు కడిగించి, పూజించే సంస్కృతిని అలవాటు చేస్తోంది. ఇది హర్షణీయం. 

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ వందనం.                                         

7, మే 2019, మంగళవారం

ఇక్కడ నవ్వుతూ దోపిడీ చేస్తారు!


సినిమా చూడాలంటే మల్టిప్లెక్స్... నెలవారీ సరకులు కొనాలంటే షాపింగ్ మాల్... భోజనం మాల్ లోనే... పిల్లల ఆటలు మాల్ లోనే. ఇదీ ఇప్పటి మధ్య తరగతి మానసిక స్థితి. సెలవు రోజొస్తే చాలు అలా ఒక మాల్ కు ఉదయాన్నే వెళ్ళి ఒక సినిమా చూసేసి, తర్వాత అక్కడే ఉన్న ఫుడ్ కోర్టులో తినేసి, పక్కనే ఉన్న ప్లే ఏరియాలో పిల్లల్ని కాసేపు ఆడించేసి, ఇంటికి వచ్చేస్తూ అదే మాల్ లో షాపింగ్ చేసేసి రావడం ఇప్పుడు సాధారణం అయిపొయింది. ఇవన్నీ వరుసపెట్టి చేయడం ఒక హోదా. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలకు అదొక హక్కయిపోయింది. "వారం అంతా కష్టపడుతున్నాం. ఆదివారం కాస్త రిలాక్స్ అవడంలో తప్పేంటి?" అని వాదిస్తారు. ఖర్చు కదా అంటే... "కష్టపడి సంపాదించేది దేనికి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం?" అంటారు. సరిగ్గా ఈ మనస్తత్వమే కార్పొరేట్ దోపిడీకి ఆస్కారమిస్తోంది. 

దోపిడీ అంటే సాధారణంగా కొట్టి, భయపెట్టి దోచుకుంటారు. కానీ ఇక్కడ ఎంట్రీ లోనే  నమస్కారం పెట్టి, నవ్వుతూ దోపిడీ చేస్తారు. అదే ఈ మాల్స్ స్పెషాలిటీ. ఎంట్రీలో  మీ వెంట తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ ని పక్కనే అట్టిపెట్టేసుకోవడంతో దోపిడీ మొదలవుతుంది. అంటే మీకు దాహం వేస్తే లోపల మంచినీళ్ళు కొనుక్కు తాగాలన్నమాట. రూ.20ల వాటర్ బాటిల్ లోపల రూ.50 ఉంటుంది. గ్లాసు పెప్సీ లేదా కోక్ ధర రూ. 200 పైనే. పాప్ కార్న్ రూ.250. రెండు సమోసాల ఖరీదు రూ.113లు. ఇది థియేటర్ లోని క్యాంటీన్ దోపిడీ. సినిమా ఇంటర్వెల్ లోని ఈ దోపిడీ కానిచ్చేసుకున్నాక ఫుడ్ కోర్టులోకి స్టైల్ గా వెళతాం కదా. అక్కడ ఏదీ తినాలన్నా ముందు ఒక వెయ్యో రెండు వేలో వేసి ప్రీ పెయిడ్ కార్డు తీసుకోవాలి. క్యాష్ తీసుకొని అమ్మొచ్చుకదా అంటే కుదరదంట. 

 దీనికో కారణం ఉంది. ఆ ఫుడ్ కోర్ట్ మొత్తం ఒకరి అజమాయిషీలో ఉంటుంది. అందులో స్టాల్స్ పెట్టుకునే వారు వారి అమ్మకాల్లో ఇంత శాతం చొప్పున ఫుడ్ కోర్ట్ నిర్వాహకుడికి ఇవ్వాలి. మరి ఒక్కో స్టాల్ లో ఎంత అమ్మకం అయ్యిందీ లెక్క కచ్చితంగా తెలియాలి కదా. అందుకనే అన్ని స్టాళ్ళకూ కలిపి ఒకే ప్రీ పెయిడ్ కార్డు చెల్లుబాటయ్యే విధానం తెచ్చారు. వాళ్ళ సౌలభ్యం బాగానే ఉంది. కానీ ఇందులో జరిగే దోపిడీ ఎలాంటిదో చెప్పుకుందాం. 

ఫుడ్ కోర్టులో బ్రాండ్ పేరుతో ఆహార పదార్థాలన్నీ రెట్టింపు ధరకు కొనుక్కుని తింటాం. రుచి, శుచి, నాణ్యత...  ఇలాంటివన్నీ మనమేం పట్టించుకోము. చుట్టూ మనలాంటి అమాయకులు చేసే సందడిని చూస్తూ నోట్లోకి తోసేసుకుంటాం. ఇలాంటి వంటకాలనే మనకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్ లో కనక వడ్డిస్తే... అబ్బో ఎన్ని పేర్లు పెడతామో! సరే... భోజనం అయిపొయింది. కార్డులో నలభయ్యో యాభయ్యో మిగిలాయనుకోండి. దాన్ని క్యాష్ చేసుకుందామంటే కుదరదు. పోనీ ఏదన్నా కొనుక్కుందామన్నా ఆ ధరలో ఏదీ రాదు. కౌంటర్ లో అడిగితే.. "ఆ డబ్బులు ఎక్కడికీ పోవుసార్, ఈసారి వచ్చినప్పుడు మీరు ప్రీ పెయిడ్ చేస్తారు కదా అందులో ఇవి కూడా కలుస్తాయి" అంటాడు. నిజమే కదా కంగారెందుకు అనుకుంటాం మనం. దీని వెనుకే పెద్ద మోసం ఉంది. మీరు మళ్ళీ ఓ నెల తర్వాతగానీ మాల్ కి వెళ్ళరు. వెళ్ళినా ఇదే మాల్ కి వెళ్తారన్న గ్యారెంటీ లేదు. వచ్చినా ఆరోజు మీరు ఈ కార్డు తీసుకురావడం మర్చిపోవచ్చు. అంటే మీ సొమ్ము  నలభయ్యో యాభయ్యో ఫుడ్ కోర్టు నిర్వాహకుడి దగ్గర నెలలపాటు ఉండి పోతుంది. ఇలా రోజుకు కొన్ని వందల మంది, నెలకు కొన్ని వేలమంది సొమ్మంతా లక్షల్లో అతని దగ్గర ఉండిపోతుంది. వడ్డీ పైసా కూడా చెల్లించనవసరం లేకుండా ఎంత ధనాన్ని సేకరిస్తున్నాడో చూసారా? 

ఆ తర్వాత ప్లే ఏరియాకు వెళ్తే అక్కడ రెట్టింపు దోపిడీ. మామూలుగానే అక్కడ కూడా ప్రీ పెయిడ్ కార్డు తీసుకుంటారు. ఐదొందలో వెయ్యో వేసి పిల్లలతో ఆటలు ఆడిస్తారు. ఫుడ్ కోర్టు మాదిరిగానే ఇక్కడ కూడా కార్డులో చివరికి  ఇరవయ్యో ముప్పయ్యో మిగిలిపోతాయి. అయితే ఇక్కడ మరో దోపిడీ అదనం. ఏమంటే మీరు కార్డులో వంద రూపాయలు వేయించారనుకోండి అందులో 65 -69 రూపాయలకు మాత్రమే ఆడగలరు. మిగిలిన డబ్బు హుష్ కాకి. పోనీ కార్డు తీసుకున్నప్పుడు ప్రాసెస్ ఫీజు కింద మొదటిసారి అలా తీసుకుంటారేమో అంటే... కాదంట మీరు కార్డులో డబ్బులు వేయించిన ప్రతీసారీ దాదాపు 30 శాతం డబ్బులు ఎగిరిపోతాయి. చూశారా ఎంత దోపిడీనో! 

అక్కడనుంచి షాపింగ్ మాల్ కి వస్తారు. ఈ దోపిడీ ఎలా ఉంటుందో ఒక నిదర్శనం చూద్దాం. కొద్ది రోజుల క్రితం తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ 15 ప్రత్యేక టీంలను ఏర్పాటుచేసి నగరంలోని 15 షాపింగ్ మాల్స్ పై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులో అనేక మోసాలు బయటపడ్డాయి.  షాపింగ్ మాల్స్ నిర్వాహకులు  తూకం వేసే మిషన్లను ట్యాంపరింగ్ చేసినట్టు తేలింది. కొన్ని వస్తువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు తేలింది. దీంతో ఒకే రోజు షాపింగ్ మాల్స్ పై 105 కేసులు నమోదయ్యాయి. ఆఫర్లని, ఉచితం అని ఆశపడి మాల్స్ కి వెళితే ఇలాగే నష్టపోతాం. 
ఇక సరుకులు కొన్నాక ప్లాస్టిక్ సంచుల విషయం మరో దోపిడీ. వాళ్ళ బ్రాండింగ్ తో సంచులు ముద్రించి. ఆ సంచుల్ని మోసుకెళ్ళే దారంతా మనతోనే ప్రచారం చేయిస్తారు. విచిత్రం ఏమంటే వాడి ప్రచారం కోసం మనమే ఐదో పదో ఎదురిచ్చి కౌంటర్ దగ్గర సంచులు కొనుక్కోవడం. వాడి తెలివి చూసారా?     
      
అయితే ఈ దోపిడీని గుర్తించిన వాళ్ళు లేకపోలేదు. దోపిడీపై పోరాడిన వాళ్ళు లేకపోలేదు. పోరాటంలో గెలిచిన వాళ్ళు లేకపోలేదు.                        

విజయ్ గోపాల్, సామాజిక కార్యకర్త  
విజయ్ గోపాల్... ఒక సామాజిక కార్యకర్త. ఫోరమ్ ఎగైనెస్ట్ కరప్షన్ అనే ఎన్జీఓ సంస్థకు  వ్యవస్థాపక అధ్యక్షుడు. అక్రమ పార్కింగ్ ఫీజు వసూళ్ళపై ఫోరమ్ సుజనా మాల్, ఇన్ ఆర్బిట్ మాల్, మహేశ్వరీ పరమేశ్వరి వంటి మాల్స్, మల్టీప్లెక్స్ లపై కేసు వేశారు. ఈయన పోరాట ఫలితంగా మల్టిప్లెక్స్, షాపింగ్ మాల్స్ లలో 2018 ఏప్రిల్ 1 నుండి పార్కింగ్ ఫీజు రద్దయింది. లేకపోతే ఇదివరకు ఈ పార్కింగ్ దగ్గర ఆఖరి దోపిడీ జరిగేది. గంటకింతని ముక్కుపిండి పార్కింగ్ ఫీజు వసూలు చేసి పంపించేవారు. 


అలాగే ప్లాస్టిక్ సంచులు, సినిమా క్యాంటీన్ అమ్మకాలు వంటి వాటి విషయంలో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడిక ఫుడ్ కోర్టులు, ప్లే ఏరియాలలో ప్రీ పెయిడ్ కార్డుల మోసాల పై కూడా పోరాడాల్సిన అవసరం ఉంది.     

            

25, ఏప్రిల్ 2019, గురువారం

వాట్సప్ పంచ్

ఒకమ్మాయి దేవుడితో ఇలా అంది. 
''దేవుడా! నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. నేను బాగా చదువుకున్నాను.  స్వతంత్రంగా బతకగలను. అన్ని పనులు స్వయంగా చేసుకోగలను. అలాంటప్పుడు నాకు మొగుడితో పనేంటి? కానీ మా అమ్మానాన్నలు పెళ్ళి చేసుకోమని చంపేస్తున్నారు. దేవుడా నువ్వే చెప్పు. నేనిప్పుడు ఏం చేయాలి?

దేవుడు పలికాడు:  చూడమ్మా! నా సృష్టిలో అద్భుతానివి నువ్వు. అందులో ఏ సందేహమూ లేదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒక్కోసారి నీవల్ల తప్పులు జరగొచ్చు. నువ్వు ఓడిపోవొచ్చు. అప్పుడు నువ్వు ఎవర్ని తిడతావు. నిన్ను నువ్వు తిట్టుకుంటావా?

అమ్మాయి : నో! నేనొప్పుకోను. 

దేవుడు: అందుకే నీకో మొగుడు కావాలమ్మా. 

అది విన్న అబ్బాయి దేవుడిని అడిగాడు. 
స్వామీ ఏమిటీ స్త్రీ పక్షపాతం? ఆవిడ చేసే తప్పులకు నేను నిందలు మోయాలా? సరే! మోస్తాను. మరి నేను ఓడిపోతే ఎవర్ని తిట్టాలి? 

దేవుడు : పిచ్చివాడా! నీకు అన్యాయం చేస్తానా? ఆమెకు కోపం వస్తే తిట్టడానికి నువ్వు ఒక్కడివే ఉంటావు. కానీ నువ్వు ఓడిపోయి.. నీకు కోపం వస్తే... విద్యా వ్యవస్థను తిట్టొచ్చు, న్యాయవ్యవస్థను తిట్టొచ్చు, రాజకీయ నాయకుల్ని తిట్టొచ్చు, అధికారుల్ని తిట్టొచ్చు, పోలీసుల్ని తిట్టొచ్చు, సినిమావాళ్ళను తిట్టొచ్చు, ప్రాంతాన్ని తిట్టొచ్చు, దేశాన్ని తిట్టొచ్చు, గాంధీని, నెహ్రూని.. అంతవరకూ ఎందుకు నన్ను ఇంకా తిట్టొచ్చు. ఒక్క నీ భార్యను తప్ప.

24, ఏప్రిల్ 2019, బుధవారం

మళ్ళీ మళ్ళీ గో గో గోవా!

గోవా...
ఎన్నిసార్లు వెళ్ళినా సొంతం చేసుకోడానికి మరో అనుభవం మిగిలే ఉందనిపించే ఓ కొత్త లోకం. దేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలన్నీ ఒకవైపు. గోవా ఒక్కటి ఒకవైపు. మిగిలిన చోట్ల కళ్ళతో చూసి అనుభూతుల్ని మనసు నిండా నింపుకుంటాం. గోవాలో మనసును కొత్త అనుభవాలతో రిఫ్రెష్ చేసుకుంటాం. జీవితాన్ని రీఛార్జ్ చేసుకుంటాం.

గోవా పటం 
గోవా అంటే ఒక నగరమో, ఒక ప్రదేశమో కాదు. ఒక రాష్ట్రం. దేశంలో రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. 1987 మే 30న భారతదేశంలో 25వ రాష్ట్రంగా ఏర్పాటయింది. ఈ రాష్ట్రంలో ఉన్నవి రెండే రెండు జిల్లాలు. ఒకటి ఉత్తర గోవా. దీనికి పనజి జిల్లా కేంద్రం. మరొకటి దక్షిణ గోవా. దీనికి మార్గోవా జిల్లా కేంద్రం. పార్లమెంటులో గోవా నుండి రెండు లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానము ఉన్నాయి. గోవా అసెంబ్లీలో 40 మంది సభ్యులున్నారు.  ఇదీ గోవా రాజకీయ సమాచారం.

మిగతా విషయాలకు వస్తే... చిన్న రాష్ట్రమే అయినా గోవాలో ఐదు నదులు ప్రవహిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి మాండవి, జువారి నదులు. గోవా ప్రజల తాగునీటికి, రవాణా వసతికి ఈ నదులే ఆధారం.

ఎలా వెళ్ళాలి? 


గోవా వెళ్ళాలంటే విజయవాడ నుంచి వాస్కోడగామాకు అమరావతి ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ నుంచి ప్రతి గురువారం వీక్లీ ఎక్స్ ప్రెస్, కాచిగూడ నుంచి వారంలో నాలుగు రోజులు మరో ఎక్స్ ప్రెస్ ఉన్నాయి. గోవాలోని మడ్ గాం, వాస్కోడగామా రైల్వే స్టేషన్లకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రెండూ బీచ్ లకు దగ్గర్లోనే ఉంటాయి. వాస్కోడగామా రైల్వే స్టేషన్ చివరిది.
దూద్ సాగర్ జలపాతం 
ముఖ్యంగా రైలు ప్రయాణం అయితే గోవా సరిహద్దు స్టేషన్లయిన  లొండా రైల్వే స్టేషన్ తర్వాత వచ్చే దూద్ సాగర్ జలపాతం, ఆ తర్వాత వచ్చే  దాదాపు 20 సొరంగాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. గోవా-కర్ణాటక సరిహద్దులోని మండోవి నదిపై ఉన్న దూద్‌సాగర్‌ జలపాతం అద్భుతమైన ప్రకృతి దృశ్యం. రైలులో కాకుండా మిగిలిన మార్గాల్లో గోవా  వెళ్ళేవారు ప్రత్యేకించి ఒక రోజు కేటాయించి జలపాతం చూసేందుకు రావాల్సి ఉంటుంది.       

ఇకపోతే హైదరాబాద్ నుంచి గోవాకు వోల్వో బస్సు కూడా ఉంది. విమాన సర్వీసులు చెప్పక్కర లేదు. హైదరాబాద్ నుంచి గంటన్నరలో గోవాకు చేరుస్తాయి. జాగ్రత్తగా బుక్ చేసుకుంటే రూ.16,000లలో నలుగురు సభ్యులున్న కుటుంబం ఫ్లైట్ లో గోవాకు వెళ్ళిరావచ్చు. ఒక్కోసారి ఇవే టిక్కెట్లు రూ.45 వేల వరకూ పలుకుతాయి. ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. గోవా ఎయిర్ పోర్ట్ పేరు 'డబోలిం'.     


ఆంగ్రియా క్రూయిజ్ 
ఆంగ్రియా క్రూయిజ్ :
ఇంకాస్త ఎంజాయ్ చేయాలనుకునేవారు. ముంబయి వెళ్ళి అక్కడి నుండి గోవాకు సముద్రం మీదుగా ఓడలో వెళ్ళొచ్చు. చుట్టూ తిరిగి రావడం ఏంటి పిచ్చా? అని అనుకోకండి. ముంబయి - గోవా మధ్య రాకపోకలు సాగించే ఈ ఓడ పేరు ఆంగ్రియా. భారత్‌లోనే మొట్టమొదటి లగ్జరీ షిప్‌ ఇదే. రోజు విడిచి రోజు ముంబయి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా గోవాకు చేరుతుంది.


ఆంగ్రియాలో 104 గదులు ఉంటాయి. వీటిని డార్మిటరీ, డీలక్స్‌, లగ్జరీ వంటి మొత్తం ఎనిమిది కేటగిరీలుగా విభజించారు. ప్రపంచస్థాయి వంటకాలు అందించే రెండు రెస్టారెంట్లతో పాటు ఆరు బార్లు, ఒక విలాసవంతమైన స్విమ్మింగ్‌పూల్‌, స్పా, పబ్‌ వంటి సౌకర్యాలు ఈ ఓడలో ఉన్నాయి. ఇక టికెట్‌ ధర విషయానికొస్తే మనం ఎంచుకునే గది కేటగిరీని బట్టి సుమారు రూ.4,300 నుంచి నుంచి రూ.7,650 వరకు ఉంటుంది. ఈ ధరలోనే స్నాక్స్‌, డిన్నర్‌, టిఫిన్ లు ఇస్తారు.
ఆంగ్రియా క్రూయిజ్ లోని గది 
      

గోవాలో తిరగడం ఎలా?  

ఇక గోవాలో దిగాక టాక్సీలే గతి. ఎందుకంటే గోవాలో ప్రైవేటు ఆపరేటర్లు నడిపే బస్సులు మాత్రమే ప్రధాన రవాణా సౌకర్యం. ప్రభుత్వ రంగంలో ఉన్న కదంబ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషను ముఖ్యమైన రూట్లలో మాత్రమే బస్సులు నడుపుతుంది. ఎక్కువ మంది పౌరులు తమ ప్రయాణాలకు స్వంత వాహనాలనే వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాల వినియోగం ఎక్కువ. ఆటోలు ఉన్నప్పటికీ ఎక్కడపడితే అక్కడ దొరకవు. ముఖ్యమైన పాయింట్లలోనే దొరుకుతాయి. పైగా చార్జీలు ఎక్కువ.

టూరిస్టు ప్యాకేజీలు నార్త్ గోవా, సౌత్ గోవా అని రెండే ప్యాకేజీలు ఉంటాయి. టాక్సీ వాళ్ళు తీసుకువెళ్తారు. అయితే వాళ్ళు చూపించినవే చూడాలి. వీటికంటే ఒక ద్విచక్ర వాహనం అద్దెకు తీసుకుంటే ఉత్తమం. ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపించాలి. అద్దె రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. కారు కూడా అద్దెకు దొరుకుతుంది. పెట్రోల్ మనదే. గూగుల్ ఉందిగాబట్టి దారులు తెలియవు కదా అని భయపడక్కరలేదు. ట్రాఫిక్ సమస్యలు అసలుండవు. కాస్తంత ఎండ ఎక్కువ అయినా రైడింగ్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కొన్ని ఏజెన్సీలు బస్ లలో గోవా అంతటా తిప్పుతారు. రోజుకు మనిషికి రూ.400 ఉంటుంది. మనకు ఇష్టమైన చోట దిగి అక్కడే ఎంతసేపైనా ఉండొచ్చు. అది చూడటం అయిపోయాక ప్రతి అరగంటకూ వచ్చే ఇంకో బస్సులో ఎక్కొచ్చు. ఏ వాహనం బుక్ చేసుకున్నా గోవా అంతటా ఒకటే ధరలు ఉంటాయి. అక్కడి ట్రావెలింగ్ సంఘాలు అన్నీ ఒక్కమాటమీదే ఉంటాయి. కాబట్టి మోసాలకు తావులేదు. అలాగని చవక కూడా కాదు. ఓలా, ఉబెర్ లాంటి సంస్థలను గోవాలో అడుగుపెట్టనియ్యలేదు ఇక్కడి ట్రావెలింగ్ సంఘాలు. అంత బలమైనవి ఈ వ్యవస్థలు.

డోనా పాలాలో  మేము బస చేసిన హోటల్ గది నుండి
కనిపించిన ప్రకృతి సోయగం 
గోవా హోటళ్ళు:  

గోవాలో ఉండటానికి హోటళ్ళకు కొదవలేదు. రోజుకు రూ.800 నుంచి రూ.5,000ల ధరలో గదులు దొరుకుతాయి. ఆపై కూడా మీఇష్టం. గోవాలో కనీసం ఒక నాలుగు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకోండి. కొంతమంది పర్యాటకులు ఇక్కడ నెలల కొద్దీ ఉంటారు. అలా ఉండి ఇక్కడే స్థిరపడిపోయిన విదేశీ యాత్రికులు కూడా ఉన్నారు. గోవా ప్రత్యేకత అదే. 
డోనా పాలా నుండి కనిపిస్తున్న ఒక హోటల్ 

గోవా అంటేనే బీచ్‌లు: 

125 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న గోవాలో అరంబోల్, వాగటర్, అంజున, బాగా, కాలాంగుట్, కండోలిం, సిన్క్విరిం,  మిరమార్, డోనాపాలా బీచ్‌లు ఉత్తరం వైపున ఉంటాయి. కోల్వా, కావలోసియం, మోబార్, పాలోలెం బీచ్‌లు దక్షిణగోవాలో ఉంటాయి.
పాలొలెం బీచ్ లో విదేశీ యాత్రికులు ఎక్కువ 
మనం మన ఊర్లో వేసుకునే డ్రెస్సులు పక్కన పెట్టండి. బీచ్ ల బయట చవకగా దొరికే తేలికయిన టీ షర్టులు, షార్ట్ లు, టోపీలతో కొత్తగా కనిపించండి. మీరెలా డ్రెసప్ అయినా అక్కడ మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఎవరి ఎంజాయ్ మెంట్ వారిది. ఇలాంటి స్వేచ్ఛ మీకు ఏ పర్యాటక ప్రదేశంలోనూ దొరకదు. గోవాలో ఎండలు బాగా ఉంటాయి. నెత్తిన టోపీ, కళ్ళకు చలువజోళ్ళు, చేతిలో నీళ్ళ సీసా మర్చిపోకండి.           



కొలంగూట్ బీచ్ 
గోవాలో ఫలానా బీచ్ కు వెళ్ళమని సలహా ఇవ్వలేం. ఎందుకంటే దేని ప్రత్యేకత దానిదే. అయితే బాగా బీచ్, కాలాంగుట్, అంజున బీచ్, కోల్వా, పాలోలెం బీచ్ లకు తప్పనిసరిగా వెళ్ళాలి. ''ఎన్ని బీచ్ లని చూస్తాం.. ఎక్కడైనా అదే ఇసుక, అదే సముద్రం కదా'' అని కొంతమంది అంటారు. వాళ్ళకు ఓపిక లేదని అర్థం. లేదా అనుభవించే తీరిక లేదని అర్థం. ప్రతి బీచ్ కు ఒక ప్రత్యేక స్వరూపం ఉంటుంది. భౌగోళికంగా కావచ్చు. సాంస్కృతికంగా కావచ్చు. సామాజికంగా కావచ్చు. అలాగే క్రైం రేట్ పరంగా కూడా కావచ్చు. మంచితో పాటు చెడు చూడటం కూడా ఒక అనుభవమే.   
పాలోలెం బీచ్ 
                                  పాలోలెమ్ బీచ్ లో సముద్రజలాలు స్వచ్ఛంగా ఉంటాయి. అన్నిటినీ మించి రద్దీ తక్కువగా ఉండి ప్రశాంతంగా ఉంటుంది. దగ్గరలోనే మంకీ ఐలాండ్, కోటిగో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ఈ బీచ్ నుంచే ప్రత్యేక బోట్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు.

ఉత్తర గోవాలో  కాలాంగుట్ బీచ్, బాగా బీచ్ లు రద్దీగా ఉండి సందడిగా ఉంటాయి. ఇదే వరుసలో కొండల మధ్య ఉంటుంది అంజునా బీచ్. ఈ బీచ్ ప్రకృతి అందాలకు నెలవు. 
డోనా పాలా విగ్రహాలు 

డోనా పాలా అనే ప్రేమికుల జంట ప్రేమకోసం ప్రాణాలు తీసుకున్న ప్రదేశం డోనాపాలా బీచ్. ఇక్కడున్న వ్యూ పాయింట్ నుంచి మంచి దృశ్యాలను ఫోటోలు తీసుకోవచ్చు. 

గోవా అంటే సముద్ర కెరటాల్లో ఆడుకోవడమే కాదు. సముద్ర జలాల్లో సాహస విన్యాసాలు అంటే అడ్వెంచర్ స్పోర్ట్స్‌ కూడా ప్రత్యేకమే. కండోలిం, బాగా, వాగటర్ బీచ్‌లలో జెట్‌ స్కీయింగ్‌, అంజునా, వాగటర్ బీచ్‌లలో పారాసైలింగ్, వాస్కో సమీపంలోని గ్రాండ్‌ ఐలాండ్‌ లో స్కూబా డైవింగ్ లు చేసుకోవచ్చు.


గ్రాండ్ ఐలాండ్ వద్ద స్కూబా డైవింగ్ 
స్కూబా డైవింగ్ చేయాలంటే దాదాపు ఒక రోజంతా పడుతుంది. ముందుగా బుక్ చేసుకుంటే ఉదయాన్నే రెండు మూడు గంటలపాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత డైవింగ్ కు తీసుకువెళ్తారు. టికెట్టు ఒక్కరికి రూ.2,500- రూ.4,000లు ఉన్నప్పటికీ స్కూబా డైవింగ్ తో పొందే అనుభూతితో పోలిస్తే ఈ ధర గిట్టుబాటే.

మందు - విందు  


ఇక గోవా అనగానే అందరూ అనుకునేది మందు కొట్టడం. గోవాలో మందు చవకే కాదు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆడామగా అన్న తేడా లేకుండా మద్యం సేవిస్తుంటారు. ఇక్కడలాగా అక్కడ మందు కొట్టే అమ్మాయిలను వింతగా చూడరు. అయితే షాపులో కొంటేనే చవక. బార్లలో తాగితే ఇక్కడికి అక్కడికీ ధరలో పెద్ద తేడా ఉండదు. బీచ్ లలో బయటి నుంచి తెచ్చుకున్న మద్యం తాగనివ్వరు. బీచ్ లో ఉండే హోటళ్ళలోనే కొనుక్కోవాలి. ఈ హోటళ్ళను 'శాక్' (shack) అంటారు.
బాగా బీచ్ లోని ఓ శాక్ 
ప్రతి శాక్ ఎదుట పొడవాటి బల్లలు వేసి ఉంటాయి. ప్రతి బల్లకు ఒక గొడుగు నీడగా ఉంటుంది. ఆ బల్లపై పడుకుని మందు కొడుతూ, ఒడ్డుకు ఉరికొచ్చే కెరటాలను చూడటం, స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టే పిల్లల్ని చూడటం మంచి అనుభూతి. కుర్రకారుని ఆకర్షించే అంశాలు మరెన్నో ఉంటాయి. కావాలంటే ఒక రెండువందల రూపాయలు ఇచ్చి ఒంటిని మసాజ్ చేయించుకోవచ్చు. మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఒళ్ళు మర్దనా చేస్తారు. 


మద్యంతో పాటు మీరు కోరుకున్న రుచికరమైన ఆహారం కూడా బీచ్ లలో దొరుకుతుంది. ఈ బల్లల విషయంలో మీకో సంగతి చెప్పాలి. మామూలుగా ఈ బల్లలపై పడుకోడానికి గంటకు వంద రూపాయల చొప్పున వసూలు చేస్తారు. అలా కాకుండా మీ శాక్ లోనే తింటాం, తాగుతాం అంటే అద్దె లేకుండా బల్లల్ని ఇస్తారు. ఇక్కడ దొరికే కింగ్ బీర్ రుచే వేరు. 
 

ఆహారం:  

ఆహారం విషయానికి వస్తే... చికెన్, రొయ్య, చేప కూరలు మన ఊళ్ళో ఎలాగూ తింటాం. అవి కాకుండా కాస్త వెరైటీగా గోవాలో సీఫుడ్ ప్రయత్నించవచ్చు. కింగ్ ఫిష్, షార్క్, రాక్ ఫిష్, టూనా చేపల వేపుడు లేదా కూరను రుచి చూడాల్సిందే. వీటిని ఆర్డర్ ఇచ్చేముందు మనకు పచ్చి చేపను తెచ్చి చూపిస్తారు. దాని సైజును బట్టి రేటు ఉంటుంది. హోటల్ ను బట్టి, సైజును బట్టి రూ.600-2,000ల వరకు ఉంటుంది. అలాగే పొంఫ్రెట్, కింగ్ క్రాబ్, లోబ్ స్టర్ లను కూడా ప్రయత్నించండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి.
ట్యూనా చేప వేపుడు 


లోబ్ స్టర్ వేపుడు 
ఆర్డర్ ఇచ్చే ముందే దాని ధర తెలుసుకోండి. బిల్లు ఇస్తున్నారా లేదా చెక్ చేయండి. ఇవేవీ చూసుకోకుండా ఆర్డర్ చేసేసి తినేసాక రూ. 2,000లు అయ్యే బిల్లు రూ.8,000లు అయినా ఆశ్చర్యపడక్కరలేదు. బీచ్ లలో మోసాలు ఈ రకంగా ఉంటాయి. ముఖ్యంగా బీచ్ లో మనం అడుగుపెడుతూనే మన దగ్గరకు వచ్చి శాక్ కు దారిచూపే వారిని అట్టే నమ్మకండి. బయట హోటళ్లతో పోలిస్తే బీచ్ లలో ఉండే శాక్ లలో ధరలు కాస్త ఎక్కువే ఉంటాయి. కానీ రుచి చూసాక ఈ మాత్రం ఖర్చు పెట్టకపొతే ఎలా? అనిపిస్తుంది. 


గోవాలో దొరికే నాన్ వెజ్ భోజనం  

బీచ్ బయట ఉండే చిన్న హోటళ్ళలో కూడా రూ.120 నుంచి 180 వరకు కోడి, చేప కూరలతో నాణ్యమైన రుచికరమైన భోజనం దొరుకుతుంది. అభిరుచి అన్నది ఉండాలే కానీ తినడానికి, తాగడానికి గోవాను మించింది లేదు.         
గోవా నుండి వచ్చేటప్పుడు మనతో పాటు మద్యం బాటిళ్ళు తెచ్చుకోవచ్చు. విమానంలో వచ్చే పనైతే ఒక్కొక్కరూ 5 లీటర్లు అంటే సుమారు 6-7 బాటిళ్ళు తెచ్చుకోవచ్చు, బస్సులోనో, రైలు లోనో అయితే ఒక్కొక్కరూ రెండు బాటిళ్ళకు మించి తీసుకురాకూడదు. ప్రతి కొనుగోలుకు బిల్లు రాయించుకుని ఎక్కడైనా చెకింగ్ అయితే ఆ బిల్లును చూపించాలి. కాజు ఫెన్నీ, టకీలా, వైన్ లు తెచ్చుకోవడం మరువొద్దు.


కేసినో ఓడ 
ఇక గోవాలో నైట్ లైఫ్ మరపురాని అనుభూతి. టిటో స్ట్రీట్ అని బాగా బీచ్ కు దగ్గరలో ఒక వీధి ఉంది. అక్కడ టిటో క్లబ్ తో పాటు చాలా క్లబ్బులు ఉన్నాయి. అలాగే బాగా, అంజునా, వాగటర్, కోలన్ గుట్ బీచ్ ల దగ్గర కూడా కొన్ని నైట్ క్లబ్ లు ఉన్నాయి. సుమారు రూ.2,000ల వరకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. ధరను బట్టి అనేక బ్రాండ్ ల మద్యం సరఫరా చేస్తారు. అదిరిపోయే డీజేతో తెల్లవారుజాము వరకూ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఇదంతా హైదరాబాద్ వంటి నగరాల్లో మామూలే కదా అనేవారు సముద్రం బ్యాక్‌వాటర్‌లో భారీ ఓడల్లో ఏర్పాటు చేసిన కేసినోలకు వెళ్ళండి. పనజిలో డెల్టిన్ రాయలే, కేసినో ప్రైడ్... మజోర్డా బీచ్ లోని ట్రెజర్ కేసినోలాంటివి అనేకం ఉంటాయి. కేసినో అంటే ఒక రకమైన జూదశాల అన్నమాట.


ఇదే జూదశాల 
కానీ ఇక్కడికి కుటుంబం అంతా వెళ్లొచ్చు. కాకపోతే 21 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే కేసినోలోకి ప్రవేశం. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా కేర్‌ సెంటర్లుంటాయి. సముద్రం, మాండవి నదులలోనే కాకుండా ఒడ్డున కూడా మరెన్నో కేసినోలు ఉన్నాయి. ఒకరికి రూ.1500 నుంచి రూ.8,000 వరకు తీసుకుంటారు. అందుకు తగ్గట్టే భారీ బఫేలు, స్నాక్స్, రకరకాల బ్రాండ్ల మద్యం సరఫరా చేస్తారు. హద్దుల్లేకుండా ఎంజాయ్ చెయ్యొచ్చు. అలాగే కేసినోలో పందెం కాయడానికి కొన్ని కాయిన్స్ టిక్కెట్టుతో పాటు ఇస్తారు. ఇంకా ఆడాలంటే కాయిన్స్ కొనుక్కోవాలి. డబ్బు గెలుచుకుంటే ఆనందం. పోగొట్టుకుంటే ఒక మంచి  అనుభవం. ఈ క్యాసినోలకు వెళ్లేముందు మనకంటూ ఒక వాహనం ఉంటే మంచిది. బోరు కొట్టినప్పుడు హోటల్ కు వచ్చేయవచ్చు. ముందే చెప్పాను కదా. గోవాలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదు. ఇక రాత్రుళ్ళయితే అంతే. భద్రత పరంగా గోవా సురక్షితమైనదే. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా.


ఆర్పొర దగ్గర ప్రతి శనివారం జరిగే నైట్ బజార్ 
గోవాలోని బాగా, అంజునా బీచ్ ల మధ్య ఆర్పోరా అని ఒకచోటు ఉంది. అక్కడ ప్రతి శనివారం నైట్ బజార్ ఉంటుంది. అలాగే అంజునా బీచ్ లో ప్రతి బుధవారం రాత్రి అంజునా ఫ్లీ మార్కెట్ ఉంటుంది. మామూలు సంతలాగా ఉండే ఈ నైట్ బజార్ల ప్రత్యేకత ఏంటంటే గోవా సంస్కృతి ఇక్కడ సందడి చేస్తుంది. ఆటలు, పాటలు, డాన్సులు ఎన్నో ఉంటాయి. వాళ్ళతో మీరు కూడా డాన్స్ చేయొచ్చు. మంచి పాటలు పాడొచ్చు. బేరం ఆడగలిగితే తక్కువ ధరకే మంచి వస్తువులు కొనుక్కోవచ్చు. గోవాకు వెళ్తే ఈ నైట్ బజార్ కు తప్పకుండా వెళ్ళాల్సిందే. మంచి షాపింగ్ అనుభవాన్ని మూటకట్టుకు తెచ్చుకోవాల్సిందే.

ఇక గోవాలో చూడదగ్గ ప్రదేశాల విషయానికి వద్దాం.... 

బామ్ జీసస్‌ బాసిలికా చర్చి: 

బామ్ జీసస్‌ బాసిలికా చర్చి
గోవాలో తప్పక చూడాల్సింది బామ్ జీసస్‌ బాసిలికా చర్చి. పాత గోవాలో గోవా రాజధాని పనజికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బామ్ జీసస్ అంటే  బాల ఏసు అని అర్థం. ఈ కేథలిక్‌ చర్చిని 1605లో కట్టారు. గోవాలోని సుప్రసిద్ధ క్రైస్తవ మత గురువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ఈ చర్చిలోనే ఉంది. ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహాన్ని బహిరంగ ప్రదర్శనకు ఉంచుతారు. అలా తీసినప్పుడల్లా ఆ మత గురువు దేహానికి గోళ్ళు. వెంట్రుకలు పెరగడం చూస్తామని భక్తుల నమ్మకం. చర్చి ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ చర్చికి ఎదురుగా గోవా  స్టేట్ మ్యూజియం ఉంటుంది.

డాల్పిన్ స్పాట్ :

సిన్క్వురియం బీచ్ నుండి ఒక్కొక్కరికీ రూ.300 తీసుకుని పడవలో సముద్రం లోపలికి తీసుకువెళ్తారు. దాన్ని డాల్పిన్ స్పాట్ అంటారు. మీ అదృష్టం బాగుంటే మీ పడవ చుట్టూ డాల్పిన్ లు ఎగురుతూ కనబడొచ్చు. డాల్పిన్ లు కనబడక పోయినా పడవ ప్రయాణం మాత్రం కాస్తంత భయంగా, అంతకన్నా ఎక్కువ సరదాగా, థ్రిల్లింగ్ గా ఉంటుంది.
డాల్పిన్ స్పాట్ 
సముద్రం మీది నుంచి దగ్గరలో ఉన్న చిన్న గుట్టలాంటి ప్రదేశంలో ఒక రాజమహల్ లాంటిది కనిపిస్తుంది. అది గోవాలో పేరుబడ్డ డాన్..  బాస్కో ఇల్లు అని పడవ నడిపేవారు చెపుతారు.

అగోడ కోట:     

అగోడ కోట తాలూకు లైట్ హౌస్ 
సిన్క్వురియం బీచ్, కండోలిం బీచ్ లను వేరు చేస్తూ అగోడ కోట ఉంటుంది. పోర్చుగీసు వారు నిర్మించుకున్న ఈ ఎర్రటి కోట సాయంత్రం వేళల్లో బాగుంటుంది. అలాగే వాగటర్ బీచ్ దగ్గరలో ఉన్న ఛపోరా కోట కూడా చూడదగిందే. మాపూసా పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోటలో సినిమా షూటింగ్ లు ఎక్కువగా జరుగుతాయి. కోటకు దిగువన సెయింట్ జెరోమ్ చర్చిని తప్పక సందర్శించండి.


గోవా స్పైస్ గార్డెన్:

ఐస్ క్రీంలలో వాడే వెనిలా
ఈ తీగ నుంచే వస్తుంది  
మున్నార్, సిమ్లా వంటి ప్రదేశాల్లోనే కాదు గోవాలోనూ స్పైస్ గార్డెన్ లను చూడొచ్చు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాల చెట్లను చూడటమే కాకుండా  వాటిని కొనుక్కోవచ్చు. భోజనంతో కలిపి ఒక్కొక్కరికీ రూ.400 ఎంట్రీ టికెట్ ఉంటుంది.  






శాంత దుర్గ దేవాలయం 

గోవాలో చెప్పుకోదగ్గ దేవాలయాలు కూడా ఉన్నాయి. మారుతి గుడి, మహాలక్ష్మి గుడి, మహాదేవ గుడి, శాంతదుర్గ గుడి, మంగేశి గుడి వీటిల్లో ప్రముఖమైనవి. మహాదేవ గుడి చుట్టూ ప్రకృతి బాగుంటుంది. 
మంగేష్ దేవాలయం 



గోవాలో క్రూయిజ్‌ విహారం:

పనజిలోని కదంబ బస్ టెర్మినస్ ను చూసుకుని అక్కడికి కిలోమీటరు దూరంలో పాత పనజి రోడ్డులో మాండవి నదిపై ఉన్న శాంటా మోనికా బోట్ జెట్టి దగ్గరకు వెళ్తే రివర్ క్రూయిజ్‌ ఎక్కొచ్చు. ముఖ్యంగా సూర్యాస్తమయం సమయాన సుమారు గంట పాటు మాండవి నదిపై మిరామర్ బీచ్ పాయింట్ వరకు ఉండే ట్రిప్ చాలా బాగుంటుంది. క్రూయిజ్‌ డెక్‌ పైన స్థానిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కొక్కరికీ టికెట్ రూ.300లు. అయితే దీని కోసం సీజన్ ను బట్టి ఒక్కోసారి గంట, రెండు గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది.
మాండవి నదిపై సూర్యాస్తమయ వేళ 
 ప్రతి బుధవారం, శనివారం రాత్రి 8:45 నుండి 10:45 వరకు డిన్నర్ క్రూయిజ్ ట్రిప్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరికీ రూ. 650లు. పన్నెండేళ్ళ లోపు పిల్లలకు రూ.300లు. రోజంతా తిరగాలంటే కూడా ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు తిరిగి రావచ్చు. 


గోవాలో సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రం కూడా తప్పకుండా చూడతగినది. ఇంకా చూడాలంటే గోవాలో చాలా ఉన్నాయి. వాక్స్ మ్యూజియం, ఆక్వేరియం హౌస్ లు చిన్న పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. 
మైనపు మెస్సీతో ఓ ఫోటో 
   

అన్నీ అయ్యాక పనజిలోని ప్రభుత్వ నిర్వహణలో ఉండే దుకాణాలలో మద్యం, సుగంధ ద్రవ్యాలు కొనుక్కోవడం మరువకండి. 



ఫెన్నీ:

గోవాలో కాజు ఫెన్నీ, కోకోనట్ ఫెన్నీ అని రకరకాల ఫెన్నీ వివిధ ధరల్లో దొరుకుతుంది. ఇది అక్కడి ప్రత్యేక మత్తుపానీయం. కాజు ఫెన్నీని జీడి మామిడితో తయారు చేస్తారు. ఫెన్నీ తయారు చేయడం గోవాలో ఒక కుటీర పరిశ్రమలాంటిది. ఈ ఫెన్నీని జలుబు వంటి వాటికి ఒక ఔషధంలా కూడా వాడతారు స్థానికులు.           



సాగరతీరం... సంధ్యాసమయం  
మరో విషయం ఏమంటే గోవాలో రాత్రి సందడి అంతా పర్యాటకులదే. అక్కడ నివసించే ప్రజలు మాత్రం సాయంత్రం ఆరు గంటలకల్లా కార్యాలయాల నుంచి ఇళ్ళకు చేరుకుంటారు. అంతకన్నా ఆలస్యం అయితే ఇళ్ళకు వెళ్లేందుకు సంస్థ వాహనాలను సమకూరుస్తుంది. ప్యాకేజీల మీద సైట్ సీయింగ్ కు తీసుకువెళ్ళే టాక్సీలు కూడా ఆరు గంటల కల్లా మిమ్మల్ని మీ హోటల్ దగ్గర దింపేస్తాయి. వాళ్ళ జీవన శైలి అలాంటిది. డబ్బు కోసం పరుగులు తీయరు.


మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...  పర్యాటకుల రక్షణార్థం గోవా ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సముద్రంలోకి వెళ్ళే పర్యాటకులకు ముందే హెచ్చరికలు చేస్తూ ప్రమాదకరమైన ప్రదేశాలలో జెండాలు పాతి ఉంచుతారు. గస్తీ సిబ్బంది అందరినీ గమనిస్తూ ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే రక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. మనం వారు చెప్పినట్టు వింటే సురక్షితంగా గోవా పర్యటన ముగించుకు రావచ్చు.                 


రాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న ఒక శాక్ 
మొత్తం మీద గోవా అంటే అందమైన బీచ్ లు, నైట్ క్లబ్ లు, క్రూయిజ్ లు, కేసినోలు, వాటర్ స్పోర్ట్స్... ఇంకా చెప్పాలంటే పోర్చుగీసు కాలానికి తీసుకెళ్ళే సంస్కృతి, అందమైన ఇళ్ళు, చర్చిలు, రణగొణ ధ్వనుల్లేని రోడ్లు, స్వచ్ఛంగా ఉండే ప్రకృతి... ఆనందం, అనుభవం తప్ప మరొకటి లేని ప్రపంచం. ఒకసారి వెళ్ళొస్తే మీరే అంటారు. 'మళ్ళీ మళ్ళీ గో గో గోవా' అని.