మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా పుణ్యమాని ముఖాముఖి మాటలకు బదులు చాటింగ్ లు, బంధుత్వ పలకరింపులకు బదులు లైకింగ్ లు, అభిరుచి వ్యక్తీకరణకు లేదా భావ ప్రకటనకు షేరింగులు అలవాటయిపోయాయి. వ్యక్తులు ఎదురుపడితే మాట్లాడటానికి తెగ మొహమాట పడిపోయి, బింకంగా సిగ్గుపడుతూ, ముడుచుకు పోయే వారు సైతం సోషల్ మీడియాలో విభిన్న ఫోజుల్లో సెల్ఫీలు పెడతారు. 'lol' అంటూ డైనమిక్ గా మాట్లాడతారు. రాబోయే రోజుల్లో మానవ సంబంధాలు ఎలా ఉంటాయో ఊహిస్తూ ఇదే సోషల్ మీడియాలో కొన్ని జోకులు కూడా వైరల్ (వైరల్ అంటే అదేదో జబ్బు అనుకునేరు... బాగా వ్యాప్తి పొందుతోంది అని చెప్పడానికి షార్ట్ కట్ అన్నమాట) అవుతున్నాయి. అందులో ఒకటి ఇలా ఉంది.
ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి చేరిన బంధువులు అతనితో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతని మంచిని గురించి నాలుగు మాటలు చెప్పుకోవడం పరిపాటి. అలా చెప్పుకుంటున్నప్పుడు ఇదివరకు ఎలా మాట్లాడుకునేవారో మనందరికీ అనుభవమే. కాకపోతే భవిష్యత్తులో ఎలా చెప్పుకుంటారో విందాం.
రాబోయే రోజుల్లో ఎవరయినా పొతే ఆ వ్యక్తి గురించి కామెంట్లు ఇలా ఉంటాయి ....
- పాపం! చాలా మంచిమనిషి. ఎపుడూ ఆన్ లైన్ లో ఉండేవాడు.. నిన్న రాత్రి గూడా పేస్ బుక్ లో మా చిన్నోడి ఫోటో పెడితే లైక్ కొట్టాడు. ఇంతలో ఏంటో ఇలా.
- ఎంత మర్యాదస్తుడని... ! ఇంటికి ఎవరన్నా అతిథి రాగానే, “మీ మొబైల్ ఛార్జింగ్ లో పెట్టమంటారా..?” అని అడిగేవాడు.
- అంతేనా “Wi-fi పాస్ వర్డ్ ఇమ్మంటారా..?” అని అడిగిమరీ ఇచ్చేవాడు.
- అందరి పోస్టులకు లైక్ లు కొట్టేవాడు..
- కరెంట్ లేకున్నా ఛార్జింగ్ తగ్గకుండా పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసేవాడు..
- అతను చేసే కామెంట్స్ ఎంత హుందాగా ఉండేవని...
- పాపం రోజు ప్రొఫైల్ ఫోటో మార్చేవాడు..
- జీవితాంతం ఒకే అకౌంట్ మీద బ్రతికాడు..