పేజీలు

29, డిసెంబర్ 2012, శనివారం

కళంకిత చరిత్ర

ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ? అంటూ నిర్వేదాన్ని ప్రకటించాడు మహాకవి. ఆయన ఇప్పుడుంటే బహుషా  రాసేందుకు మాటలు దొరక్క కలం ముడుచుకు కూర్చునే వాడేమో. ఎందుకంటే  రక్తంతో తడిసిన పుటలు లేకుండా ఏ చరిత్ర పుస్తకమూ ఉండక పోవచ్చు, కానీ ఇంత నీచమైన, అమానవీయమైన సంఘటన గురించి రాసుకోవాల్సిన దుస్థితి భారతదేశ చరిత్రకే దక్కింది. అమరవీరుల స్మారక స్థూపాల సరసన, మహామహుల సమాధుల పక్కన ఇప్పుడు మరో స్మారక చిహ్నాన్ని ఉంచాల్సిన అవసరం ఏర్పడింది.

అవును! ఢిల్లీ ఘటన బాధితురాలు చనిపోయింది. ఇప్పుడేంటి... పదమూడు రోజుల క్రిందటే జీవచ్చవమైనది. ఇప్పుడా జీవాన్ని తన దగ్గరకు రప్పించుకున్నాదు ఆ దయగల దేవుడు. బ్రతికి వుంటే ఎంత నరకాన్ని అనుభవించవలసి వచ్చేదో! ఎన్నో ఘోరమైన ఘటనలను చూసి, మనుషులను యంత్రాల మాదిరిగా భావించి చికిత్స చేసే వైద్యుల కళ్ళు కూడా చెమర్చాయంటే ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉండిందో అర్ధం చేసుకోగలం.

అలాంటి పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. ప్రముఖులంతా సంతాపాలు ప్రకటించేసారు. బొత్స లాంటి వాళ్ళు ఇలాంటి 'చిన్న' విషయాలని మర్చిపోయి రాజకీయాలలో తలమునకలై ఉండి ఉంటారు. సామాన్య ప్రజలు ప్రస్తుతానికి 'అయ్యో' అని నిట్టూరుస్తున్నా, రెండు రోజులు మాత్రమే. మరో రెండు రోజుల్లో రాబోయే కొత్త సంవత్సరాన్ని నూతన ఆకాంక్షలతో జరుపుకుంటాడు. కొన్ని సంవత్సరాల పాటు విచారణ కొనసాగి నిందితులకు ఏదో ఒక శిక్ష పడుతుంది. అంతే? సమాజం బాధ్యత, పాలకుల బాధ్యత, న్యాయస్థానాల బాధ్యత అయిపోతుంది. ఓ ఘటన మరుగున పడిపోతుంది. చాలా? మన చరిత్ర పవిత్రమైనదే అనుకుని భావితరాలు మురిసిపోయేటందుకు అర్హత లభించినట్టేనా?
ఇలాంటి ఘటనలు ఇక పునరావృతం కానట్టేనా?

జలియన్ వాలా బాగ్ లాంటి మారణహోమాన్ని ఈ చరిత్ర చూసింది. మహాత్ముల హత్యను చూసింది.మత విధ్వంసాలను, మహా స్కాములను, వేర్పాటు ఉద్యమాలను, మహనీయ త్యాగాలను ఈ చరిత్ర రాసుకుంది. వాటిని మరచిపోకుండా ఉండటానికి వీలైన చోట్ల స్మారక భవనాలు, స్థూపాలు, సమాధులు కట్టించి మా చరిత్రలో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని అనుకుంటూ ఉంటాం. అలాగే ఈ ఘటన లాంటివి కూడా మళ్ళీ జరగడానికి వీల్లేదు. ఎవరూ మర్చిపోడానికి వీల్లేదు. అందుకే ఒక స్మారక చిహ్నం దేశ రాజధానిలో ఆమె పేరున నెలకొల్పబడాలి. దాన్ని చూసిన వారెవరయినా ఇలాంటివి జరగకుండా మీరేం చర్యలు తీసుకున్నారు అని అడిగితే, సమాధానం చెప్పగలిగే స్థాయిలో మనమున్నామా లేదా అని మన పాలకులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. మా చరిత్రకు కళంకం అంటితే మేమిలా తుడిచేసాం అని దేశం చెప్పుకోగలిగేలా ఉండాలి. అలా జరగాలంటే ఆమె పేరున ఒక స్మారకాన్ని నెలకొల్పాలి. అంతేకాదు ఇలాంటివి జరగడానికి కారణాలేంటి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాల గురించి చర్చలు జరగాలి. మేధావులు, సామాజికవేత్తలు, మానసికనిపుణులు, రక్షణ విభాగం , పాలనా యంత్రాంగం అందరూ దీని గురించి ఆలోచించాలి. అందుకే ఆమె స్మారక చిహ్నం అవసరం. 

   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి