పేజీలు

28, మార్చి 2015, శనివారం

వాట్సప్ పంచ్


ఏది అసలైన భాగ్యం? 

అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని.

దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. నలభై ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాబ్భై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.

అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. 'శహభాష్' అంటూ లక్ష్మీపతిని అభినందించారు.

అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, 'నేను వెళ్తున్నా' అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.
'ఎవరది ?' అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.
'నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా' ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.
'అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా!' కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.
'అవును!' ప్రతిధ్వనించింది ఆత్మ
'వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.
'అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట. ఆ పొట్ట చూడు బానలాగా ఎలా ఉబ్బిపోయిందో. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం ? నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాసస్థలం. నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకూ సమస్యలే. నాకు రక్షణ లేదు. సుఖం లేదు.
అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు .. డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా? నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు. ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తుకుతెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేనుండలేను వెళ్తున్నా!'
ఆ రాత్రి తాను కూడబెట్టిన లక్ష్మిని ఇక్కడే వదిలిపెట్టి, లక్ష్మీపతి స్వర్గానికో, నరకానికో మొత్తానికి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది. దాంతో ఈ రోజు, ఈ క్షణాన్ని ఆనందించడం మరచిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?                                     

18, మార్చి 2015, బుధవారం

వాట్సప్ పంచ్

4
                                                                          'అమర' ప్రేమికులు 
వారానికోసారి డేటింగ్ చేసుకుని మరీ ఒకరినొకరు గాఢంగా ప్రేమను ఇచ్చి పుచ్చేసుకున్నారు, అదే ప్రేమించుకున్నారు కలియుగ రాధ, కృష్ణలు. ఆ ప్రేమ గాఢత ఇద్దరి ఇళ్ళలోనూ పొగ పెట్టింది. ఎవరికి వాళ్ళు తమ పిల్లలకి క్లాసులు పీకారు.
మరుసటి రోజు ప్రేమికులు ఇద్దరూ కష్టంగా కలుసుకున్నారు. ఇక తాము కలిసి బ్రతకడం అసాధ్యం అని అర్థమైంది వాళ్ళిద్దరికీ. కాబట్టి కలిసి మరణించి వారి ప్రేమను అమరం చేద్దామనుకున్నారు.
ఆ మరుసటి రోజు అనుకున్న ప్రకారం సూసైడ్ పాయింట్ చేరుకున్నారు. తాము దూకపోయే లోయలోకి చూసేసరికి ఇద్దరికీ కళ్ళు తిరిగాయి. అయినా వారి సంకల్పం చెక్కుచెదరలేదు. ఒకరిని ఒకరు చివరిసారిగా చూసుకున్నారు. 'వచ్చే జన్మలో నువ్వు నా దానివే' అన్నాడు కృష్ణ. 
'వీల్లేదు' అరిచింది రాధ. అయోమయంగా చూశాడు కృష్ణ.
'ఏడేడు జన్మలకూ నేను నీ దాన్నే' అంది రాధ.
'పద! ఒకరి చేతులు మరొకరు పట్టుకుని దూకుదాం' అన్నాడు కృష్ణ.
'వద్దు! నీ చేతి స్పర్శకు నాలో బతకాలనే ఆశ పుట్టొచ్చు. ఈ ప్రోగ్రాం ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్సిల్ కావడానికి వీల్లేదు.' అంది రాధ.
'సరే! మూడంకెలు లెక్క పెడతాను. మూడు అనేసరికి ఒకేసారి సెకను తేడా చేయకుండా దూకేద్దాం' అన్నాడు కృష్ణ.

ఒకటి ... రెండు ... మూడు

కృష్ణ దూకేసాడు. రాధ మాత్రం పైనే ఉండిపోయింది.
లోయలోకి చూస్తూ 'సారీ కృష్ణ నన్ను క్షమించు. అలాగని మన ప్రేమకు అన్యాయం చెయ్యను.  నీ జ్ఞాపకాలలో మన ప్రేమను బతికించుకుంటాను.' అంటూ గాలిలో ఫల్టీలు కొడుతూ కిందికి పడిపోతున్న కృష్ణను జాలిగా చూడసాగింది.

ఇంతలో కృష్ణ వీపున ఉన్న పారాచ్యూట్ తెరచుకుంది.
'ఇందాకటి నుంచీ దాన్ని బ్యాక్ ప్యాక్ అనుకున్నా. పారాచ్యూట్ అన్నమాట.'  ఆశ్చర్యపోయింది రాధ.
'అమర' ప్రేమికులు కదా!
      
                            

16, మార్చి 2015, సోమవారం

వాట్సప్ పంచ్



3

పరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు. మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు   రాసినా  ఎందుకిలా జరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే రుజువు చేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు. ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివి వినిపించమన్నారు జడ్జి గారు. అవి ఇలా ఉన్నాయి:
ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు ?
జవాబు : అతను పాల్గొన్న చివరి యుద్ధంలో
ప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడ సంతకం చేశారు ?
జవాబు : పేజీ చివరన 
ప్రశ్న : మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు ?
జవాబు : ఆయన పుట్టిన రోజున
ప్రశ్న : భార్యా భర్తల మధ్య విడాకులకు ప్రధాన కారణం ఏంటి ?
జవాబు : పెళ్ళి
ప్రశ్న : ఆరు మామిడి పళ్ళను ఎనిమిది మందికి సమానంగా ఎలా పంచుతావు ?
జవాబు : మాంగో షేక్ చేసి
ప్రశ్న :  గంగా ఫ్లోస్ ఇన్ విచ్ స్టేట్ ?
జవాబు : లిక్విడ్ స్టేట్
ప్రశ్న : భారతదేశంలో ఎక్కువ మంచు పడే చోటు ?  
జవాబు : మందు గ్లాసులో
ప్రశ్న : హిందూ చట్టం రెండవ వివాహాన్ని ఎందుకు అంగీకరించదు ?
జవాబు : భారతీయ చట్టం లోని ఆర్టికల్ 20 (2) ప్రకారం ఒక మనిషి చేసిన
ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించకూడదు   

2, మార్చి 2015, సోమవారం

వాట్సప్ పంచ్

 2

'సార్ ! మా ఆవిడ కనిపించట్లేదు' పోలీస్ స్టేషన్లో  ఎస్ ఐ కి కంప్లైంట్ చేశాడు మొగుడు.   
ఎస్ ఐ : చెప్పండి! మీ ఆవిడ ఎప్పట్నుంచి మిస్సింగ్
మొగుడు : నిన్న షాపింగ్ కోసం బయటికి వెళ్ళింది. మళ్ళీ రాలేదు.
ఎస్. ఐ . : ఆవిడ ఎత్తు ఎంత చెప్పండి
మొగుడు : యావరేజ్ అనుకుంటా సర్.
ఎస్ ఐ : ఆరోగ్యం బాగుందా ?
మొగుడు : బాగానే ఉందనుకుంటా
ఎస్ ఐ : ఆవిడ కళ్ళ రంగు ?
మొగుడు : ఎప్పుడూ గమనించలేదు సర్
ఎస్ ఐ : జుట్టు రంగు ?
మొగుడు : ఒక్కో సీజన్లో ఒకలా ఉంటుంది
ఎస్ ఐ : ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు? అప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా ?
మొగుడు : ఉన్నాను సర్! కాకపోతే చీరలో వెళ్ళిందా, పంజాబీ డ్రెస్ లో వెళ్ళిందా సరిగా చూడలేదు .
ఎస్ ఐ : షాపింగ్ కు ఎలా వెళ్లారు ? ఐ మీన్ ఏదైనా వెహికల్ ?
మొగుడు : అవును సర్ ! కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది
ఎస్ ఐ : కారు రంగు ?
మొగుడు : బ్లాక్ కలర్ ఆడి ఎ 8 విత్ సూపర్ చార్జ్ డ్ 3. 0 లీటర్, వి 6 ఇంజన్ జనరేటింగ్ 333 హెచ్ పి , ఎయిట్ - స్పీడ్ టిప్ట్రోనిక్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ విత్ మాన్యువల్ మోడ్. ఎల్ ఇ డి హెడ్ లైట్స్. ఎడమ వైపు  ఫ్రంట్ డోర్ మీద సన్నగా 3 సెంటీ మీటర్ల స్క్రాచ్ ఇంకా... 
గడాగడా చెప్పేసి ఏడవడం మొదలెట్టాడు మొగుడు.
ఆ ఏడుపు చూసి కరిగిపోయిన ఎస్ ఐ,''ఊరుకోండి సర్ ! ఎలాగైనా మీ కారును వెదికి పట్టుకునే పూచీ నాది '' అన్నాడు ఆ మొగుడిని అనునయిస్తూ. 

   

1, మార్చి 2015, ఆదివారం

వాట్సప్ పంచ్

1

వృద్ధాశ్రమం నుంచి కొడుక్కి ఫోనొచ్చింది. ఆశ్రమంలో ఉన్న అమ్మకు చివరి ఘడియలు దగ్గర పడ్డాయని, ఆఖరి సారిగా కొడుకును కలవాలని కోరుతుందని ఆ పిలుపు సారాంశం. ఆఖరి చూపులు అని కచ్చితంగా చెపుతున్నారు కాబట్టి, ఎలాగోలా తీరిక చేసుకుని తల్లి దగ్గరకు వెళ్ళాడు కొడుకు.
తల్లి నిజంగానే ఆఖరిక్షణాల్లో ఉంది. ఎంతైనా తల్లి కదా, మనసు కరిగిందేమో ! 'అమ్మా, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉందా? అని అడిగాడు.
'అవును నాయనా! నిన్ను పిలిచింది కూడా అందుకే. ఈ ఆశ్రమంలో ఇన్నాళ్ళూ గాలాడక ఉక్కబోతతో, వేడిని భరించలేక పోయేవాళ్ళం. కొన్ని ఫ్యాన్లు తెప్పించి పెట్టు నాయనా?' అంది తల్లి.
'అంతేనా అమ్మా' అడిగాడు కొడుకు.
'ఒక ఫ్రిడ్జ్ కూడా తెప్పించు నాయనా. పొద్దున్న ఎప్పుడో వండిన కూరలు నిలువ చేసుకోడానికి ఫ్రిడ్జ్ లేకపోవడంతో రాత్రికి పాడై పోయేవి. ఆ కూరలతో తినలేక వారంలో రెండు మూడు రాత్రులు పస్తులతో పడుకునేదాన్ని.'
'ఫ్యాన్లు, ఫ్రిడ్జ్... చాలా అమ్మా?'
'మంచి బెడ్డు, టీవీ, గీజర్,
 ఇంకా... '
'ఆగాగు. నిన్ను చూస్తే చివరి ఘడియల్లో ఉన్నావు. కానీ నీ కోరికలు చూస్తే కొత్త కాపురానికి కావలిసిన జాబితా చదువుతున్నావు. అయినా ఇన్నాళ్ళూ నీకిన్ని కష్టాలు ఉన్నాయని ఎప్పుడూ చెప్పలేదు. అలాంటిది ఇప్పుడెందుకు చెపుతున్నావు?' అర్థంకాక అడిగాడు కొడుకు.
'చూడునాయనా!  నేను చిన్నప్పటినుంచీ కష్టాలకు అలవాటుపడినదాన్ని కాబట్టి ఇవన్నీ నాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ రేపో మాపో నీ కొడుకులు నిన్నిక్కడి పంపిస్తే, నువ్వు వీటన్నిటినీ భరించలేవు. అంత సుకుమారంగా పెంచాము నిన్ను. అందుకే తల్లిగా ముందే జాగ్రత్తపడమని చెప్తున్నా'  అని కనుమూసింది తల్లి.