పేజీలు

15, జులై 2015, బుధవారం

బాహుబలి - ది బిగినింగ్ ఈజ్ నాట్ కన్విన్సింగ్ !



బాహుబలి (ఓ కట్టప్ప కథ!) ..  

బాహుబలి సినిమా మొదటి ఐదు రోజుల్లో రూ.215కోట్లు వసూలు చేసిందంట. నిజమే అయ్యుండొచ్చు. కానీ వసూలు చేసింది సినిమా కాదు. వసూలు ఏజెంట్లు చాలా మంది ఉన్నారు. టివి మీడియా, ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, రాజమౌళి(దర్శకుడు కాబట్టి తప్పదనుకోండి), నిర్మాతలు (కోట్లు పోసాక రాబట్టుకోవాలి కదా మరి), సినీ అభిమానులు... ఇంకా చాలా మంది ఏజెంట్లు ఉన్నారు. ఒక్క అభిమానులకు తప్ప మిగిలిన వారందరికీ, ఈ రకమైన ప్రచారంతో ఎవరికి ఉండే లాభాలు వాళ్లకు ఉంటాయనుకోండి. 

ఏడాది ప్రచారం   

ఏడాది నుంచి జనం నోళ్ళలో బాహుబలి పేరు నానింది. ప్రమోషన్ ఎంతలా జరిగిందంటే.. మొదటి రోజే సినిమా చూడకపోతే తలవంపులే అన్నట్టు ఒకడు, చేతిలో బాహుబలి మొదటి రోజు టికెట్ పెట్టుకుని 'సిటీలో హయ్యస్ట్ ఇన్ఫ్లుయన్స్ ఉపయోగిస్తేనే కానీ దొరకలేదు మామా' అని గొప్పలు పోయేవాడు ఒకడు, 'ఉత్త మాటలు చెప్పడం కాదు, నాకు మా ఇద్దరు ఫ్రండ్స్ కీ టిక్కెట్లు తెచ్చివ్వు. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం' అంటూ బాయ్ ఫ్రండ్ ప్రేమకు పరీక్ష పెట్టిన అమ్మాయిలు, 'మా అబ్బాయి చంపేస్తున్నాడండీ. మనకెవరైనా బాహుబలి టికట్లు ఇప్పించగలుగుతారా?' అంటూ కొలీగ్ ని అడిగిన ఉద్యోగులు, 'మా వాడు నిన్నటి నుంచీ బాహుబలి టికట్ల కోసం థియేటర్ల వెంబడి తిరుగుతూనే ఉన్నాడు' అంటూ తమ కొడుకు ఘనకార్యం ఏదో చేసినట్టు పక్కింటావిడతో గొప్పలు చెప్పిన ఇల్లాలు ... ఇలా సినిమా విడుదల నాటికి చెప్పలేనంత మౌత్ పబ్లిసిటీ జరిగిపోయింది. దాంతో కలెక్షన్ల వర్షం కురిసింది. భారతీయ సినిమా వసూలు రికార్డులను బలంగా బద్దలుకొట్టింది బాహుబలి. 

ప్రేక్షకులేమన్నారు.. ? 

అయితే సినిమా విడుదలైన కొద్ది గంటల్లో ప్రభాస్ శివలింగానికి బదులు పెద్ద ఝండూ బామ్ బాటిల్ ను మోసుకొస్తున్న ఫోటో ఒకటి ఫేస్ బుక్ లో హల్ చల్ చేసింది. నిజమా! అంత బోరు కొట్టిందా అనుకునే లోపు, అద్భుత రేటింగ్ లను ఇస్తూ రివ్యూలు వచ్చాయి. సూపెర్బ్ అనీ, ఎపిక్ అనీ రకరకాలుగా ప్రముఖులు కామెంట్ చేశారు. రాజమౌళి సాధించాడు అనుకునే లోపు సినిమా చూసొస్తున్నా అంటూ వచ్చిన వాడు 'పరవాలేద'న్నాడు. ఇంకొకడు ఫోన్ చేసి 'ఏవరేజ్ ' అన్నాడు. 'ఒకసారి చూడొచ్చు' అని ఒకడన్నాడు. ఇదేంటి?  రివ్యూలకీ, మౌత్ టాక్ కీ ఈ తేడా ఏంటి ? సినిమా సామాన్య ప్రేక్షకుడిని, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుడిని తృప్తి పరచలేక పోయిందా? గ్రామాలలో అయితే, సినీ భాషలో చెప్పాలంటే 'సి' క్లాస్ సెంటర్లలో ప్రేక్షకులు అసలు తృప్తిపడలేదు. 
ఎందుకంటే... 

ప్రేక్షకులు అసలు తృప్తిపడలేదు. ఎందుకంటే... 

ఆదివారం ప్రసాద్ మల్టిప్లెక్స్ లో సెకండ్ షో టిక్కట్టు దక్కించుకుని దర్జాగా కూర్చున్నా. 'నేనూ బాహుబలి చూశాను' అని రేపు ఆఫీసులో చెప్పుకోవచ్చు అనుకుంటున్నా. నిజానికి డాల్బీ అట్మొస్ ఎఫెక్ట్ తో చూడాలనుకున్నా. కానీ ఆ సౌకర్యం ఒక స్క్రీన్ కే ఉంది. ఆ టిక్కట్టే కావాలంటే ఇంకో వారం ఆగాలి కాబట్టి అడ్జస్ట్ కాక తప్పలేదు. 
సెన్సార్ సర్టిఫికేట్ పడి, కృతజ్ఞతలు తెలుపుకుని బ్యానరు కనపడగానే 'బాహుబలీ' అని అరిచాడు ఓ బుడుగు. ఐదారేళ్ళ ఆ  పసివాడి ఉత్సాహానికి హాలంతా నవ్వింది. అంటే రాత్రి పదిన్నరకు చిన్న పిల్లల్నేసుకుని, ముసలాల్లని చేయి పట్టుకుని నడిపిస్తూ, అబాలగోపాలమూ తరలివచ్చిందన్న మాట. 

సినిమాలో ఆఖరు సీన్లో కట్టప్ప వెనుకనుంచి బహుబలిని కత్తితో పొడుస్తాడు. సినిమా అయిపొయింది. 'అదేంటి? సినిమా అయిపోయిందా?' అనడిగింది ఓ ఇల్లాలు. 'మిగతాదంతా రెండో పార్టులో చూపిస్తారు.' చెప్పాడు పదిహేనేళ్ళ కొడుకు. 'ఛ! ఇదేమన్నా సీరియల్లా? మూడేళ్ళు తీశారన్నావ్ ఇదేనా? నిద్రంతా పాడు... ' గొణుక్కుంటూ జనంతో ఎగ్జిట్ గేటు వైపుకు కదులుతోంది ఆ సగటు గృహిణి. ఖాళీ అయిన సీట్ల వంక చూస్తే చాలామంది అలాగే కూర్చుని ఉన్నారు. ఐ మీన్ గురక పెట్టి నిద్రపోతున్నారు. ఒకతన్ని తట్టి లేపాడు స్నేహితుడు. 'ఓర్నీ నిద్రపోయావా?' అడిగాడు. 'వార్ సీన్ మొదలైన కాసేపటికి నిద్ర పట్టేసింది బాబాయ్.' కళ్ళు నులుముకుంటూ లేచాడతను. రికార్డులను సృష్టించే లక్ష్యంతో మొదటిసారి సగటు ప్రేక్షకుడిని రాజమౌళి నిర్లక్ష్యం చేశాడా అనిపించింది.

నిజానికి 'ది బిగినింగ్' లో సినిమా మొదలయ్యింది అంతే. 

పాత్రలు, పాత్రల స్వభావాలు పరిచయమయ్యాయి. మామూలుగా అయితే ఇంటర్ వెల్ లో ట్విస్ట్ ఇచ్చి వదులుతారు. ఇక్కడ సినిమా అయిపొయింది అంతే తేడా. ' విలన్ గా రాణా అదుర్స్' అని ఎవరో బాలీవుడ్ పెద్దాయన అన్నాడు. అసలు ఇందులో రాణా విలనిజం ఏం కనిపించిందో ఆయనకు! రమ్యకృష్ణ ఏక్షన్ సూపర్బ్ అన్నారు. ఒక్క సీన్ కూడా అలా అనిపించలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది బాహుబలి కథ కాదు, కట్టప్ప కథ. సినిమా అంతా అతనే కనిపించాడు. చివరి ట్విస్ట్ కూడా అతనిమీదే ఉంది. సత్యరాజ్ పాత్ర వరకు బాగుంది. 
ఒక్క విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు డబ్బు పెట్టే నిర్మాతలు దొరక్క, తక్కువ ఖర్చులో సినిమాలు ఎలా చెయ్యొచ్చో చెబుతూ, సామాజిక మాధ్యమంలో గందరగోళం ట్వీట్ లతో కాలక్షేపం చేస్తుంటే, రాజమౌళిని నమ్మి 250 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధం కావడం గొప్పే. ఆ గొప్పదనం ఏ మాత్రం తగ్గకుండా సినిమాలో విజువల్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ అన్న ఆలోచనే ఎక్కడా రాలేదు. 
జలపాతం సన్నివేశాలు చూడాల్సిందే. హీరో జలపాతం పైకి చేరుకునే క్రమంలో వచ్చే రొమాంటిక్ సాంగ్ ను అద్భుతంగా చిత్రీకరించారు రాజమౌళి. 
ఇక రెండోది మాహిష్మతి సామ్రాజ్యం.  తెలుగు తెరపై నిజంగా అపూర్వం. 
మూడోది యుద్ధం
కథాపరంగా...  రాజ్యాధికారం ఎవరికి ఇవ్వొచ్చో తేల్చడానికి పనికొచ్చే కథాంశం. దీన్ని మరీ అంతసేపు సాగతీయక్కరలేదు. డబ్బులు పెట్టింది ఇక్కడే. సగటు ప్రేక్షకుడికి  బోరు కొట్టించిందీ ఇక్కడే. రాజమౌళికి కితాబులు దక్కిందీ ఇక్కడే. భారీ కలెక్షన్లకి కారణమూ ఇదే. అసలు రెండు భాగాలను కలిపేసి కథ రక్తికట్టాక క్లైమాక్స్ లో ఇలాంటి యుద్ధం ఉంటే సినిమా నిజంగా ఎపిక్ అయ్యుండేది. ఇప్పుడు ఇది కేవలం ఎ - పిక్ అంటే ఒక చిత్రం.. అంతే. 

రీజన్ కు అందని విషయాలు :

బాహుబలి గానీ అతని కొడుకు శివుడు గానీ అంత శక్తిమంతులు ఎలా అయ్యారు? 

ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వంలో వచ్చిన 'సీతారామ కళ్యాణం' సినిమాలో రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకలించే సన్నివేశం ఉంటుంది. అది కల్పిత సన్నివేశమే అయినా రావణాసురుడి లాంటి శక్తిశాలికి సైతం సూపర్ పవర్స్ ఇవ్వలేదు ఎన్టీఆర్. పర్వతాన్ని ఎత్తడానికి రావణుడు పడే యాతన ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ శివుడు ఒక భారీ రాతి శివలింగాన్ని భుజాన ఎత్తుకుని నీళ్ళలో దూకడం మరీ మచ్ అనిపించింది. 
తన కొడుకును కాదని, తోడికోడలు కొడుకుపై అన్నివిషయాలలోనూ రాజమాత మొగ్గు చూపడానికి కారణం ఏంటి? వాళ్ళు పెద్దయ్యాక యుద్ధానికి వెళ్ళేటప్పుడు గానీ ఎవరు ఎలాంటి వారు అన్న విషయం తేలలేదు. కానీ చిన్ననాటినుంచీ బాహుబలికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినట్టు? 
ఇకపోతే 'మరణం' అంటూ తమ సైనికులు యుద్ధభూమి నుంచి భయపడి పారిపోయి వస్తుంటే, వారిని ఉత్తేజపరచి, తిరిగి యుద్దోన్ముఖులను చేయడానికి బాహుబలి చేసిన ప్రసంగం చప్పగా ఉంది. మూడు ముక్కల్లో 'నేను చెప్పాను కాబట్టి,మీరు రెచ్చిపోండి!' అన్నట్టుగా ఉంది. యుద్ధాన్ని అంతసేపులాగి, బాహుబలి వ్యక్తిత్వాన్ని చాటే ఈ ముఖ్యమైన సన్నివేశాన్ని అంత తేలికగా ఎందుకు తీసుకున్నారో!

కొన్ని సీన్లను చాలా చక్కగా తీశారు రాజమౌళి. 

బాహుబలి పేరు వినగానే అన్నిరకాల కళాకారులు, బానిసలూ ఉత్తేజం పొందడం బాగా తీశారు. అయితే అక్కడే ప్రతినాయకుని రియాక్షన్స్ మరింత జాగ్రత్తగా తీయాల్సింది. ఎందుకంటే...  కొన్నేళ్ళ నుంచీ ఆ రాజ్యంలో ఏ పేరయితే వినబడనీయకుండా చేశాడో, ఆ పేరు ఇన్నాళ్ళకు అనుకోకుండా వినబడితే, ఒక క్రూరుడి ప్రతిస్పందన ఇంత చప్పగా ఉండదు. 
ఇక సినిమాలో హాస్యం శూన్యం. అలాంటిది ఏదయినా ఉందంటే... అది కాలకేయ సైన్యం మాట్లాడే భాష.  మాయాబజార్ లాంటి ఎపిక్ లోనూ కావలిసినంత హాస్యం ఉంది. ఈ సినిమాలో అలాంటిది ఎక్కడా లేకపోవడం సామాన్య ప్రేక్షకుడికి అసంతృప్తిని కలిగించింది.  
ఈ లోపాలన్నిటినీ రెండవ భాగం సరిచేసుకుంటుంది. ఇది తథ్యం. ఎందుకంటే ముందుంది అసలు కథ. అందులోనూ విజువల్స్ కే ప్రాధాన్యత ఇచ్చి, కథను పలుచన చేస్తే, ఇకపై ఇలాంటి చిత్రాలను, పబ్లిసిటీని జనం నమ్మరు. ఇకపై తెలుగుచిత్రాలకు ఇంత బడ్జెట్ గాని, క్రేజ్ గానీ, ఇంత స్థాయిగానీ రాదు. 
  
                                                                         
                                        
                              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి