పేజీలు

15, మార్చి 2013, శుక్రవారం

మి(మ)ధ్య తరగతి

'జాతీయ ఇల్లు హక్కు బిల్లు -2013'ను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వార్త. అంటే 'విద్యాహక్కు చట్టం' మాదిరిగానే 'ఇల్లు హక్కు చట్టం' అన్నమాట.  విద్యాహక్కు చట్టం ప్రకారం దేశంలోని 6-14 సంవత్సరాల వయసున్న పిల్లలంతా ఉచితంగా , అంటే ఎలాంటి ఫీజు కట్టనవసరం లేకుండా బడిలో చదువుకుంటూ ఉండాలి. అది ఎంత వరకు అమలవుతుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వచ్చేది 'ఇల్లు హక్కు చట్టం'.  ఇది మాత్రం అందరికి  కాదండోయ్. కేవలం గ్రామీణ పేదలకు మాత్రమే అట. మరి పట్టణ పేదల సంగతి ఏంటో?

విద్యా హక్కు చట్టం ఉన్నా దానిని ఉపయోగించుకోడానికి పేదలు ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే వారి దృష్టిలో పిల్లలంటే ఆదాయ వనరుల కింద లెక్క. వాళ్ళు పనికి కాకుండా బడికి పోయి కూర్చుంటే పూటకింత బువ్వ, రాత్రికింత మందు దొరికేదేట్టా? కానీ ఇప్పుడీ ఇల్లు హక్కు అనగానే అందరూ ముందుకొచ్చే వాళ్ళే. ఎందుకంటే 10 సెంట్ల (484 గజాల) భూమి అంటే ఊరకనే వస్తుందా?  ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు, జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం కింద ఇల్లు, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు,... ఇలా ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇళ్ళు చాలా ఉన్నాయి. అవన్నీ పేదలకే అని చెప్తున్నా, ముఖ్యమంత్రి పేరుమీద కూడా  ఈ ఇళ్ళు మంజూరయిన వింతలు చూస్తుంటే అవి ఎవరికి అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దర్జాగా స్కార్పియోలో వచ్చిన  ఆసామి ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ వైద్యం అందుకున్నా, నాలుగు అంతస్తుల ఇంటికి యజమాని అయ్యుండీ, నెలకు నలభై వేల అద్దెలు తీసుకుంటున్న వ్యక్తి, కనీసం తీసుకుంటున్న అద్దెకు రశీదు కూడా ఇవ్వకుండా ఆదాయపు పన్ను నుంచి తప్పించుకుంటున్న వ్యక్తి తెల్లకార్డును కలిగివున్న పేదగా చలామణి అవుతున్నా, ప్రభుత్వం మాత్రం ప్రతి పథకం పేదల గురించే రూపొందిస్తుంది. పేదలంటే ప్రభుత్వాలకి అంత ప్రేమ మరి.

ప్రభుత్వాలకి డబ్బున్న పెద్దలంటే మరీ మరీ ప్రేమ. పేదలకు ఉచితంగా భూములిచ్చినట్టే, డబ్బులున్న పేదలకు  కూడా  ప్రభుత్వం అతి ఖరీదైన భూముల్ని కారు చవకగా , ఒక్కోసారి అప్పనంగా అప్పగించేస్తుంది. పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉద్యోగాలు ... అని ఇలా అనేక కారణాలు చెప్పి రాయతీలిస్తుంది.

అటు పేదలకు, ఇటు ధనికులకూ కూడా ఈ ఉదార పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి డబ్బునిచ్చేది మాత్రం మధ్య తరగతి ప్రజలు. వాళ్ళకు పరువే ముఖ్యం. నియమాలను అతిక్రమించడం వాళ్లకు తెలీదు. చట్టం అంటే గౌరవం. పోలీసంటే భయమ్. అందుకే పస్తులుండి అయినా పన్నులు  కడతారు. అద్దె ఇంట్లో ఉంటూ కూడా ఆదాయపు పన్ను కడతారు. ప్రతి పైసాకు లెక్క చెప్తారు. అయినా ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు వాళ్ళు లెక్క లోకి రారు.
పన్నులు పెరిగినా, ధరలు పెరిగినా, చార్గీలు పెరిగినా ఏ  రాయితీ లేకపోవడం మూలంగా అన్ని భారాలను చచ్చినట్టు మోసే మధ్య తరగతి వాడంటే అందరికీ లోకువే. అందుకే ఇల్లు హక్కు అనేది వీళ్ళకు వర్తించదు. ఆరోగ్య పథకాలు వర్తించవు. విద్య ఉద్యోగాలలో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు.  ఆ మాటకొస్తే వీళ్ళు జనాభా లెక్కల్లోనూ ఉండరు. ఎలాగంటారా? ఉదాహరణకు మన రాష్ట్ర జనాభా 8. 46 కోట్లు. మన రాష్ట్రంలో ఉన్న తెల్ల కార్డులు 2. 3 కోట్లు. అంటే 2. 3 కోట్ల నిరుపేద కుటుంబాలలో, ఇంటికి కనీసం నలుగురు చొప్పున నిరుపేదలే 8. 12 కోట్ల మంది ఉన్నారన్న మాట. ( మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత ఈ అరవై ఏళ్ళలో సాధించిన ఘనత ఇదే ) మిగిలినవాళ్ళు  కచ్చితంగా మిలియనీర్లే. నీకెలా తెల్సని అడుగుతారేమో! రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రముఖులు, రాజకీయ నాయకులు, వీరి సేవలో నిత్యం తరించే అయ్యాఎస్ లు... ఇలా లెక్కేస్తే, నా లెక్క సరిపోతుంది. ఇక మధ్యతరగతి వాళ్ళెక్కడ ఉన్నారు చెప్పండి? అందుకే మన ప్రభుత్వాలు ఈ మిధ్యాతరగతి గురించి ఏమీ ఆలోచించవు. మొన్నటికి మొన్న...  ఆదాయపు పన్ను పరిమితిని పెంచమని అడిగితే, మన ఆర్థిక మంత్రి చిదంబరం గారు కొంపలు మునిగి పోతాయన్నంత భావాన్ని ఒలికించారు. ఆయనకూ తెలుసు. పైనోడు ఖర్చులు చూపించి తప్పుకుంటాడు. కిందోడు లెక్కే చూపించడు. ఇక బొక్కసాన్ని నింపేది మధ్యోడే. పరిమితి పెంచేసి వాడికి వెసులుబాటునిస్తే  మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా? లక్ష కోట్ల కుంభకోణాలకి ఆస్కారమివ్వడం ఎలా?     

పేదోడి దగ్గర ఓటు ఉంది. అది అధికారాన్ని ఇస్తుంది. పెద్దోడి దగ్గర నోటు ఉంది. అది ఓటును కొనుక్కోడానికి, అధికారంలో కోట్లు కూడేసు కోడానికీ వ్యక్తిగతంగా  పనికొస్తుంది. అంచేత రాజకీయాలన్నీ పేదోడిని మచ్చిక చేసుకోడానికి, పెద్దోడిని  ప్రసన్నం చేసుకోడానికి చూస్తాయి. మధ్య తరగతోడు అటు ఓటేయడానికి రాడు. ఇటు డైరెక్ట్ గా నోటు ఇవ్వడు. అందుకే వాడికి ఎలాంటి  హక్కూ ఉండదు. నిత్యం సమస్యల సమరంలో కొట్టుకుసచ్చే మధ్యతరగతి  వాడు విడిగా ఉద్యమాలు చెయ్యగలడా? అది కూడా చాతకాదు కాబట్టే ఇంత అలుసు.  


అయ్యా! గౌరవనీయమైన పాలకులూ! ప్రజాసేవలో పునీతమవుతున్న నాయకులూ! అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అన్న సామెత ఉంది కాబట్టి  అడుగుతున్నాం. పేదోడు అడగకపోయినా వరాలు కురిపిస్తారు. పెద్దోడు అడగగానే ఆఘమేఘాల మీద పనిచేసి పెడతారు. అలాగే మధ్య తరగతోడి మీదా కాస్త దయచూపండి. త్రిశంకు స్వర్గం లాంటి బతుకులను కాస్త దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళూ మనుషులేనని...  సారీ!  ఓటర్లేనని  గుర్తుంచుకోండి. వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోండి. వాళ్ళకూ తలదాచుకునేందుకు నీడ కావాలి. ఆ ఇళ్ళ గురించీ ఆలోచించండి.కనీసం ఇంటి స్థలమైనా ఇవ్వండి.  ధరల గురించి ఆలోచించండి. మధ్య తరగతి పించన్ల గురించీ ఆలోచించండి.  వారికీ సామాజిక భద్రత  ఇవ్వండి. అయ్యా! మధ్య తరగతిని రక్షించండి!