పేజీలు

abdul kalam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
abdul kalam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జులై 2015, బుధవారం

తీరని లోటంటే ఇదీ అర్థం!



ఎవరైనా చనిపోయినప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతూ.. 'ఆయన మరణం ఒక తీరని లోటు' అని అలవాటుగా అనేస్తుంటారు. ఉన్నంత కాలం జనాన్ని పీడించి, భయపెట్టి వేధించిన వాడు పోయినప్పుడు, 'పీడా విరగడై పోయిందిరా బాబు' అని జనం సంతోషిస్తుంటే వీళ్ళెంటి తీరని లోటు అంటారు అనిపించేది. ప్రజాసేవ పేరు చెప్పి కబ్జాలు చేసి, దౌర్జన్యాలు చేసి, కోట్లు కూడపెట్టి, అధికారాన్ని అడ్డంగా వాడుకుని ఎవడైనా పోతే, ఎవరికి తీరనిలోటు అనిపించేది. నిజానికి కొంతమంది పోయినప్పుడు ఆస్తి చేతికొస్తుందని ఒకడు సంతోషిస్తాడు. తను ఆశిస్తున్న పదవికి ఉన్న ఏకైక అడ్డు తొలగిపోయిందని ఒకడు సంతోషిస్తాడు. తీరని లోటు అనే ప్రకటన పైపై మాటే. రోజుకు ఎంతోమంది పోతారు. సమాజానికి ఎప్పుడూ ఏ లోటూ రాలేదు. ఎందుకంటే ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఎవడో ఒకడు ఉండనే ఉంటాడు.  
  
కానీ అబ్దుల్ కలాం పోయాడనగానే నా మనసులోనే లోటు కనిపించింది. కీర్తి తప్ప ఆస్తి మిగుల్చుకోని వ్యక్తి, గౌరవం తప్ప శాపనార్థాలు ఎదుర్కోని వ్యక్తి, శ్రేయస్సు తప్ప కీడు తలంచని వ్యక్తి చనిపోయాడు అని వినగానే నాదన్నది ఏదో పోయిందనిపించింది. దీన్నే లోటు అంటారేమో!

ఇక ఫేస్ బుక్ లో అయితే కలాం పేరు లేకుండా ఒక్క పోస్టూ కనపడలేదు. చాలామంది కవర్ పేజీలో, ప్రొఫైల్ పిక్ గా కలాం ఫొటోనే పెట్టుకున్నారు. కలాంగారి కొటేషన్లయితే కోకొల్లలు. ఆయన నిరాడంబరత, భావుకత, చుట్టూ ఉన్న మనుషుల పట్ల ఆయన చూపించిన ప్రేమ. కార్యదక్షత, శ్రమతత్వం గురించి పత్రికల్లో  ఎన్నెన్నో కథనాలు. చదువుతూ ఉంటే అద్భుతం అనిపించినవి కొన్ని. కళ్ళు చెమరింప చేసినవి మరికొన్ని. పెళ్ళి కానివాడు ఇంతమంది చిన్నారులకు సొంత తాతయినాడు. తన ఫోటోలకు ముద్దులు పెట్టించుకున్నాడు. అంత వయసు వాడు ఈ తరానికి కూడా ఆదర్శం ఎలా కాగలిగాడు! 

మన ఉపగ్రహాలను మనమే పంపించుకోడానికి కష్ట పడిన దశ నుండి.. తక్కువ ఖర్చుతో ఇతర దేశాల ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి పంపిస్తూ లక్షల కోట్లు సంపాదించే స్థాయికి మన దేశ సాంకేతికతను తీసుకువెళ్ళిన మనిషి కలాంగారు. 

ఆయన ఆస్తులేవీ సంపాదించుకోలేదు. ఆయనే దేశానికి తరగని ఆస్తయ్యాడు. అందుకే ఆయన మరణం ఒక లోటు అనిపిస్తుంది. 

                                             

28, జులై 2015, మంగళవారం

మహనీయ వ్యక్తిత్వాలు ఇలా రూపుదిద్దుకుంటాయి



అబ్దుల్ కలాం వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు. కానీ అందరూ తెలుసుకోవలసింది ఏంటంటే ఆ వ్యక్తిత్వాన్ని అలా చెక్కిన శిల్పులెవరూ అన్నది. కలాం గారు చెప్పిందే ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకుందాం. 
కలాం చిన్నతనంలో ఒకరోజు... 
కలాం వాళ్ళ అమ్మ ఓ రోజు రాత్రి ఇంట్లో అందరికీ రొట్టెలు చేసి పెట్టింది. అయితే పని ఒత్తిడిలో పడి  రొట్టెలు మాడిపోతున్న విషయం ఆమె గమనించలేదు. కూరతో సహా ఆ మాడిపోయిన రొట్టెలనే భర్తకు వడ్డించింది ఆమె. తండ్రి ఆ రొట్టెలను చూసి ఎలా స్పందిస్తాడో అని ఎదురుచూస్తున్నాడు బాల కలాం. కానీ తండ్రి ఏమీ మాట్లాడకుండా ఆ రొట్టెలను తింటూ, కలాంను పిలచి స్కూల్లో విశేషాలేంటి అని అడిగాడు. ఆ విశేషాలు ఏం చెప్పిందీ కలాంకు గుర్తులేదు కానీ... ఆ రాత్రి రొట్టెలను మాడ్చినందుకు తన తల్లి భర్తను క్షమాపణ అడిగిన విషయం, 'పిచ్చిదానా ! నాకసలు మాడిపోయిన రొట్టెలంటేనే ఇష్టం. నువ్వేం బాధపడకు' అంటూ తండ్రి అన్న మాటలు మాత్రం గుర్తుండి పోయాయి. 
ఆ తర్వాత తండ్రికి గుడ్ నైట్ చెప్పడానికి వెళ్ళిన కలాం, 'నీకు నిజంగానే మాడిపోయిన రొట్టెలు ఇష్టమా? అని తండ్రిని అడిగాడు. అప్పుడాయన కలాంను దగ్గరకు తీసుకుని 'మీ అమ్మ రోజంతా పనిచేసి చేసి అలసిపోయింది. దానివల్ల రొట్టె మాడిఉండొచ్చు. అయినా ఒకరోజు మాడిపోయిన రొట్టె తిన్నంత మాత్రాన ఏమీ అయిపోదు. రొట్టె మాడిందని కోపంతో ఏదైనా మాట్లాడితే దానివల్ల మీ అమ్మ మనసు గాయపడుతుంది కదా. దేనివల్ల ఎక్కువ నష్టం?' అని అడిగాడు. 
ఆ మాటలు అబ్దుల్ కలాం వ్యక్తిత్వం మీద చాలా ప్రభావాన్ని చూపించింది. మనం గమనించం గానీ రోజూ మన ఇళ్ళలో మనం మాట్లాడుకునే మాటలు పిల్లల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అబ్దుల్ కలాం గొప్పదనం గురించి మాట్లాడుకునే ముందు, ఆయన తండ్రి గొప్పదనాన్ని కూడా గుర్తించాలి. అదే సమయంలో మన ఇంట్లో ఉన్న బాల కలాం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో మన పాత్రను ఎలా పోషిస్తున్నామో ఆలోచించాలి.