పేజీలు

కెసిఆర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కెసిఆర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఆగస్టు 2015, సోమవారం

వీళ్ళు మారాలంటే ప్రజలు మారాలి!



ఒక నియోజకవర్గంలో ఓటు వేసేందుకు అర్హత ఉన్నవారు 100 మంది ఉన్నారనుకుంటే, అందులో ఓటరు జాబితాలో పేరున్న వారు 80 మంది ఉంటారు. పోలింగ్ శాతం 60 అనుకుంటే  ఆ 80 మందిలో ఓటేసిన వారు 48 మంది అన్నమాట. గెలుపొందిన అభ్యర్థి లేదా పార్టీకి మళ్ళీ 60 శాతం ఓట్లుపడి విజయ ఢంకా మ్రోగించింది అనుకుంటే ఆ 48 మందిలో 28-29 మంది ఆ అభ్యర్థికి ఒటేశారన్న మాట. అంటే 100 మంది ఓటర్లలో ఒక ముప్పై మంది మాత్రమే బలపరిచిన అభ్యర్థి 100 మంది ఓటర్లకు, అంతకు మించిన జనాభాకు ప్రతినిధిగా చెలామణి అవుతాడన్నమాట. దీన్నే మనం ప్రజా'స్వామ్యం' అంటున్నాం. 
ఇది రాజ్యాంగ రచనలో లోపం కాదు. రాజ్యాంగ అమలులో లోపం. ఓటుకు అర్హత ఉన్న వందకు వంద మందీ ఓటింగులో పాల్గొన్నప్పటి సంగతి గురించి రాజ్యాంగం చెప్పింది. కానీ అమలులోకి వచ్చేసరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటును ఇవ్వడంలో ప్రభుత్వాలు, ఎన్నికల సంఘాలూ విఫలం అవుతున్నాయి. అదే విధంగా ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనేలా చేయడంలోనూ ఈ వ్యవస్థలు శ్రద్ధ చూపడం లేదు. అందువల్ల 70 మంది నుండి మద్దతు సాధించలేని వ్యక్తికూడా 30 మంది మద్దతుతో విజేతగా నిలుస్తున్నాడు. ఈ ముప్పై మందిపై  కూడా డబ్బు, మద్యం, రిగ్గింగ్  ప్రభావాలు ఎంతవరకు ఉంటాయో అభ్యర్థులకు బాగా ఎరుక. 

ఇక తెలంగాణా విషయానికి వస్తే... 

3.63 కోట్ల జనాభా ఉన్న మన తెలంగాణాలో ఓటర్లు 2.82 కోట్ల మంది ఉన్నారంట. 2014 సాధారణ ఎన్నికలలో 73శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అంటే దాదాపు 2 కోట్ల 6 లక్షల మంది ఓటు చేస్తే, అందులో మళ్ళీ తెరాస పార్టీకి  64.7 శాతం ఓట్లే పడ్డాయి. అంటే  మొత్తం 3కోట్ల 63 లక్షల మందిలో 1 కోటి 33 లక్షల మంది మాత్రమే తెరాస కావాలనుకున్నారు.
ఓటర్లు 2.82 కోట్ల మందేగా 3.63 లక్షల మందిని ఎలా లెక్కలోకి తీసుకుంటారు అని మీకు సందేహం రావచ్చు. నిజమే!... కానీ మిగిలిన వారిలో ఓటు హక్కు ఉన్నా ఓటరు జాబితాలో పేరులేని వాళ్ళు ఉండొచ్చుగా. అదేం కాదు మిగిలిన వాళ్ళంతా మైనరు బాలలే అనుకున్నా వారి అభిప్రాయాలను కూడా పరిగణన లోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే...  తెలంగాణా కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారు వెయ్యిమంది అని, ఇంకా ఎక్కువ మంది అనిచెప్పి, మనం తెలంగాణా తెచ్చుకున్నాం. ఆత్మహత్య చేసుకున్నవారిలో  మైనర్లు కూడా  ఉన్నారు. వారి ఆకాంక్షలను పరిగణించి తెలంగాణా ఇచ్చినప్పుడు, గెలుపు నిర్ణయంలో కూడా వారి ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని నా వాదన. అందుకే జనాభా మొత్తాన్ని పరిగణన లోకి తీసుకోవడం జరిగింది . ఈ రకంగా చూస్తే తెలంగాణ లోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబమే గులాబీ రంగుది.

ఇంతకూ విషయం ఏంటంటే... 

మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గురించే  ఇదంతా చెప్పుకోవలిసి వచ్చింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న (రాజీనామా చేసేశారంట లెండి... కాకపోతే ఆమోదించబడలేదు) సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్నటి 2014 ఎన్నికల ప్రకారం 2,20,969 మంది ఓటర్లు ఉంటే 56.45% ఓట్లు పోలయ్యాయి. అంటే 1,24,737 మంది ఓటేశారు. వాటిల్లో తలసానికి 56,475 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 25.55 శాతం ఓట్లతో ఆయన గెలిచారు. దీనర్థం నియోజకవర్గంలోని ప్రతి నలుగురిలో ఒక్కరే ఆయన ప్రాతినిథ్యం కావాలనుకున్నారు. వీళ్ళల్లో తెలుగుదేశం పార్టీని చూసి ఎంత మంది ఓటేశారు, తలసానిని చూసి ఎంతమంది ఓటేశారు అన్నది పక్కన పెడితే... ఏ పార్టీ తరపున పోటీ చేసినా నెగ్గుకు రాగలనన్నది మంత్రిగారి ధీమా.  పార్టీని అడ్డం పెట్టుకుని గెలిచేవారు కాదు, పార్టీని గెలిపించే బలమైన అభ్యర్థులే కావాలని కెసిఆర్ కూడా అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా అలాంటి బలమైన అభ్యర్థిగా పరిగణించారు కాబట్టే పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. ఒకవేళ మళ్ళీ పోటీ అంటూ వస్తే తలసానికి ఉన్న వ్యక్తిగత బలం 56,475 ఓట్లు, అదే ఎన్నికలలో తెరాస పార్టీకి వచ్చిన 29,014 ఓట్లు కలిపి ఈసారి 90 వేల ఓట్లు గెలుచుకుంటామని ఇటు తలసాని, అటు కెసిఆర్ భావిస్తున్నారేమో అనిపిస్తోంది. మంచిదేగా 2,20,969  ఓట్లలో 90 వేల ఓట్లతో గెలవడం ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయడమే!
అయితే ఆలస్యం దేనికో అర్థం కాదు. రాజీనామా ఇచ్చానని తలసాని అంటారు. మరి ఇస్తే స్పీకర్ కు దాన్ని ఆమోదం చేయడంలో అభ్యంతరం ఏమిటి? కెసిఆర్ చెప్పందే ఆ పని చేయడం స్పీకర్ కు కష్టం అనుకుంటే కెసిఆరే ఆమోదించమని చెప్పొచ్చుకదా! అసలు నా సత్తా చూపించుకున్నాకే మంత్రి పదవి తీసుకుంటా అని తలసానే పదవికి రాజీనామా చెయ్యొచ్చుగా.  వీటిల్లో ఏదీ జరగదు. ఎందుకంటే అటు కెసిఆర్ కు గానీ, ఇటు తలసానికి గానీ తమ మీద తమకు నమ్మకం లేదు. అసలు తెరాసకు గ్రేటర్ లో తన భవిష్యత్తు ఏమిటో స్పష్టత లేదు. ఉంటే గ్రేటర్ ఎన్నికలే జరిగేవి. 
అయితే ఈ లోపు తలసాని మాత్రం కెసిఆర్ కరుణ, మెప్పు పొందడానికి చాలా చేస్తున్నారు. సినిమావాళ్ళతో మీటింగు పెట్టి, 'కెసిఆర్ తో మంచిగా ఉండకపోతే మీకు కష్టాలు తప్పవు' అని హెచ్చరించడం దగ్గర నుంచి 'చంద్రబాబును మెడ పట్టి జైల్లోకి తోస్తాం' అనడం వరకు తనకు ఓటేసిన ప్రజలు ఆశ్చర్యపోయేలా మాట్లాడారు. 
అలాగే నగరంలో బాగా పట్టున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సైతం తెరాసలో చేర్పించేందుకు స్వయంగా రాయభారం నడుపుతున్నారు. 
వాళ్ళంతట వాళ్ళు పార్టీలు మారడం, పదవులు ఎక్కేయ్యడం, ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా మాట్లాడటం... అంతా వాళ్ళిష్టమేనా అని తలసాని నియోజకవర్గంలో ఓటర్లు అనుకోవచ్చు. ఒకసారి ఒటేశాక మీకు మాట్లాడే హక్కెక్కడుంది. అసలు మీరు ఆయనకు ఓటేసిన ఒక్కరా? ఒటేయని ముగ్గురిలో ఒక్కరా? మీకో విషయం తెలుసా! ఇప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ తలసానే గెలిచినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రజలు పదేళ్ళకోసారి మాత్రమే మారతారు.         
             
       
    
                  
   

6, ఆగస్టు 2014, బుధవారం

తనివి తీరలేదు

















ఇన్నాళ్ళు ఉద్యమాలు నడిపించి, ఉద్యమ ఫలాలను అధికారం రూపేణా ఆరగిస్తున్నా కెసిఆర్ కు ఇంకా కొట్లాట తనివి తీరలేదు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో భాగంగా జయశంకర్ సారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కెసిఆర్ చేసిన ప్రసంగం ఈ ముచ్చటే చెబుతోంది. తెలంగాణ సిద్ధాంత కర్త జయంతి కాబట్టి తెలంగాణ ప్రజలలో స్ఫూర్తి నింపే మాటలు మాట్లాడాల్సిందే. అయితే అవి భవిష్యత్ కార్యాచరణల గురించి ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ కూడా మేమింకా ఆంధ్రోళ్ళ మీద కొట్లాడతం అనుడే బాగాలేదు.  కొట్లాడనీకి తెలంగాణ సమస్యలు మస్తున్నయ్. నిన్న గాక మొన్న విద్యుత్ కోతలపై రైతులు కొట్లాడితే, ఆళ్ళ మీదికి పోలీసోల్లు కొట్లాడనీకి పోయిన్రు. ఒక వైపు సిటీల్ల గూడా కరెంటు కోతలున్నయ్. ఇంకో దిక్కు రుణాల రీషెడ్యూల్ విషయంలో ఆర్బీఐతో లొల్లి ఉండనే ఉంది. మరో దిక్కు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లొల్లి సుప్రీం దాకా వెళ్లి నెత్తిన మొట్టికాయలు వేయించుకునే వరకు వచ్చెనాయె. ఇవన్నీ ఉండగా ఆంధ్రోనితోని లొల్లి ముచ్చట దేనికి? ప్రజల ఆలోచనలను సమస్యల నుండి ప్రక్కదారి పట్టించుడే అని అనిపిస్తాంది.

మా తెలంగాణలో యూనివర్సిటీ పేరు మార్చుకుంటే నీ ఏడుపేంది అంటన్నవ్. 'ఆ యూనివర్సిటీ అందరం కలిసున్నప్పుడు,  అందరం కట్టిన పన్నుల లెక్కలోంచి పైసలు దీసి కట్టిన యూనివర్సిటీ కదా. నీ ఒక్కనిదే అన్నట్టు నీకిష్టమైన పేరు పెడితే ఎలా? నీకంత సంబరముంటే ఇక మీదట తెలంగాణలో ఉండే ప్రజలు కట్టే పన్నులు పెట్టి  కొత్తగా ఏమైనా కట్టుకో, ఆటికి నీ ఇష్టమొచ్చిన పేరు పెట్టుకో ' అని ఆంధ్రోళ్లు అనరా?  మీ విగ్రహాలను మీరు తీస్కపోండి అన్నడు సారు. 'సరే మా విగ్రహాలతో పాటు మేం కట్టించిన వన్నీ, అభివృద్ది చేసినవన్నీ మాకిచ్చెయ్ తీస్కపోతం' అని వాళ్ళంటే ఏం చెప్తం? తెలంగాణలో విద్యుత్ కష్టాలు చంద్రబాబు వల్లే అన్నడు సారు. మాకేవో సమస్యలు ఉండి మా ప్లాంట్లలో ఉత్పత్తి ఆగిపోతే మధ్యలో నీ ఏడుపెంది అని అల్లంటే మనకెట్లుంటది?

మీ పిల్లల ఫీజులు మీరే కట్టుకొండి అంటున్నరు.  ఎనకటికి కాళోజి సారు 'క్విట్ తెలంగాణ' అంటే జయశంకరు సారు ఏం చెప్పిండు? 'ఆ మాట తప్పు. ఈడకొచ్చి స్థిరపడినోల్లందరూ మనోల్లే' అన్నడు కదా! యాదికి లేదా కెసిఆర్ సారూ? ఆయన తెలంగాణను ప్రేమించిండు కానీ, ఆంధ్రోల్లను గానీ, మలెవల్లను గానీ ద్వేషించలే. అట్ల సెయ్యమని ఎన్నడూ చెప్పను గూడా చెప్పలే. మరి ఆయన పుట్టిన రోజు నాడు ఇవేం మాటలు సారూ?


      

27, జూన్ 2014, శుక్రవారం

నవభారత నిర్మాత పీవీ నరసింహరావు



        భారత రాజకీయ నాయకులలో మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించబడి, అంతే సమానంగా విస్మరించబడిన
వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు. పేద, ధనిక అన్న తేడా లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందంటే, కిరాణా దుకాణం నుంచి సాఫ్ట్ వేర్ సంస్థల వరకు కనీసం ఒక కంప్యూటర్ లేకుండా పని జరగడం లేదంటే,
దానికి కారణం, నిస్సందేహంగా పివి నరసింహారావే. కేవలం పాముల్ని ఆడించే దేశంగానే ప్రపంచ ప్రజలకి తెలిసిన
భారత దేశాన్ని ఐ టి హబ్ గా, తిరుగులేని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దింది ఈ పాములపర్తి నరసింహారావే. ఇంకా చెప్పాలంటే
దేశానికి రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చింది 1947లో అయితే, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది 1991లో , అంటే పీవీ ప్రధాని అయ్యాకే.

విప్లవ యోధుడు పివి :

ఈ తెలుగు బిడ్డ పుట్టింది తెలంగాణ గడ్డ మీదే. 1921 జూన్ 28న నాటి హైదరాబాదు రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో పుట్టిన  పీవీ, నాగపూర్ యూనివర్సిటీ  న్యాయవాద పట్టా పుచ్చుకున్నాడు . తనకు వరుసకు అన్న అయ్యే పాములపర్తి సదాశివరావుతో కలిసి 'జయ-విజయ' అన్న కలం పేరుతో నాటి కాకతీయ పత్రికలో వ్యాసాలు రాసేవారు. అనంతరం నాటి ఉద్యమాలకు ఆకర్షితుడై నిజాం కు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం కూడా చేశానని, తమ మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు  ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే తాము మాత్రం సైన్యం కురిస్తున్న బుల్లెట్ల వర్షం నుండి తప్పించుకుంటూ, ప్రాణరక్షణకై  పరుగులుదీస్తూ ఒక అడవిలో తలదాచుకున్నట్టు తన స్వీయ చరిత్ర గురించి రాసుకున్నారాయన. 

ఇందిర విధేయుడు :

స్వాతంత్ర్యం తరువాత జాతీయ కాంగ్రెస్ లో చేరిన పివి, ఇందిర విధేయుడిగా పేరు పడ్డాడు. 1969 లో కాంగ్రెస్ లో చీలిక వచ్చినప్పుడు కూడా అయన ఇందిరనే అంటిపెట్టుకుని ఉన్నాడు. 1970 లో భూదానోద్యమ బాధ్యతను పూర్తిగా ఆయనకు అప్పచెప్పింది ఇందిరమ్మ. ఆ ఉద్యమ నేపథ్యంలో ఆయన తన వారసత్వ భూములను సైతం జాతికి ఇచ్చేసాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతటి విధేయుడే ఆ తర్వాత గాంధీ- నెహ్రూ కుటుంబ వారసత్వపాలనను  బహిరంగానే వ్యతిరేకించి కాంగ్రెస్ నాయకులంతా ' ఎంత ధైర్యం' అంటూ  నోటి మీద వేలేసుకునేలా చేశారు.  ఆ రకంగా వాఖ్యానించి కూడా కాంగ్రెస్ లోనే కొనసాగ గలిగిన మొదటి ధీశాలి పీవీనే.

దేశ ప్రధాని పీవీ  :

13 భాషల్లో ప్రావీణ్యం, సామాజిక, రాజకీయ, ఆర్థిక  విషయాలలో  అద్భుత మేధాశక్తితో పాటు కష్టపడే తత్వం ఉన్న పీవీని  అనేక పదవులు అయాచితంగానే  వరించాయి . ఒకానొక దశలో జ్ఞానీ జైల్ సింగ్ తర్వాత రాష్ట్రపతి పదవికి జరిగిన రేసులో కూడా పీవీ పేరు వినవచ్చింది.  ఆ పదవులన్నీ రావడానికి కారణం, ఆయన ఇందిర కుటుంబానికి సన్నిహితుడు కావడమే అని కొందరు కాంగ్రెస్ వాదుల అభిప్రాయం. బహుషా ఆయన ప్రధానిగా కాకపోయినట్లయితే  ఆ అభిప్రాయం అలాగే ఉండిపోయేదేమో!

నాటి రాజకీయ పరిణామాల వల్లే కాని, ఆయనకున్న ఇతర సాహిత్యపరమైన వ్యాపకాల వల్లే కాని,  1991 నాటికి పీవీ దాదాపు రాజకీయరంగ విరమణకు దగ్గరలో ఉన్నారు.  మరోవైపు ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ అప్పటికీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. అనేక అభియోగాల మధ్య కూరుకుపోయిన పార్టీ, మళ్ళీ అధికారం కోసం రాజీవ్ అధ్యక్షతన పోరాడుతోంది. కానీ అంతలోనే రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం, దేశమంతా చెలరేగిన సానుభూతి పవనాలు, కాంగ్రెస్ ఘన విజయం ... అనీ చకచకా జరిగిపోయాయి. రాజకీయ పగ్గాలు చేపట్టేందుకు సోనియా సుముఖంగా లేకపోవడం వల్ల ప్రధాని పదవికి నెహ్రూ కుటుంబేతర నాయకుల్లో పోటీ ఏర్పడింది. శరద్ పవార్ గట్టి పోటీని ఇచ్చినప్పటికీ,  సహజంగానే అన్ని అర్హతలతో పాటు, మృదుస్వభావి, సౌమ్యుడు అన్న పేరున్న పీవీ నరసింహరావును ప్రధాని పదవి వరించింది. ఆ వెంటనే
పార్లమెంటు సభ్యత్వ అర్హత కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని నంధ్యాల పార్లమెంటు నియోజకవర్గం నుండి ఉపఎన్నికలో  పోటీచేశారు. తమ రాష్ట్రం నుండి ఒక తెలుగువాడు, అది కూడా ఉత్తరాది ఆధిపత్యాన్నీ నిలువరిస్తూ ఒక దక్షిణాది నాయకుడు,  తొలిసారిగా నెహ్రూ కుటుంబేతర వ్యక్తి భారతదేశ ప్రధాని కాబోతున్నాడన్న అభిమానంతో తెలుగు ప్రజలు ఆయన్ని 5. 8 లక్షల ఆధిక్యంతో గెలిపించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ  పోటీ నుంచి విరమించింది. అంతటి ఆధిక్యం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా చోటు చేసుకుంది.

 దేశానికి ఆర్థిక స్వాతంత్ర్యం :

పీవీ ప్రధాని అయ్యేనాటికి కేవలం 2. 3 % వృద్ధిరేటుతో  దేశ ఆర్థిక స్థితి దారుణస్థాయిలో ఉంది.  ఎంత దారుణం అంటే దేశ అవసరాల కోసం 47 టన్నుల బంగారాన్ని తాకట్టుపెట్టి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి అప్పు తెచ్చుకోవలిసి వచ్చింది. వీటన్నిటికీ కారణం అప్పటిదాకా ప్రభుత్వాలు అనుసరించిన ఓటు బ్యాంకు పోకడలు. అనవసర సబ్సిడీలు.  సంస్థలన్నిటినీ జాతీయం చేసుకుపోయేసరికి పని అనేది రాజకీయం అయ్యింది. ఉత్పాదకత తగ్గింది.  సరిగ్గా ఆ సమయంలో పగ్గాలు చేపట్టిన పీవీ ప్రముఖ ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని ఆయనకు సర్వాధికారాలను, పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఫలితంగానే ఐ టి అన్నది భారతదేశంలోకి కాలు మోపింది. టెలికాం సంస్థలు తమ సాంకేతిక నెట్వర్క్ ను భారత్ కూ విస్తరింపచేశాయి. పలు దేశీయ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పని సంస్కృతి అభివృద్ధికరంగా మారింది. నాణ్యతలో, సేవలలో పోటీ తత్వం పెరిగింది. ఒకప్పుడు మన దేశం నుండి ఇతర దేశాలకు తరలిపోయిన మేథో సంపత్తి, పారిశ్రామిక వర్గాలు తిరిగి స్వదేశానికి రావడం (రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ ) మొదలయ్యింది. పీవీ, మన్మోహన్ అనే ఇద్దరు మేధావుల కలయిక మొత్తం దేశ గతినే మార్చేసింది. కొద్ది రోజుల్లోనే భారతదేశం ఆర్థిక సంక్షోభం నుండి తేరుకుని అనతికాలంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. అందుకే మేధావులు అంటారు దేశానికి ఆర్థిక స్వతత్ర్యాన్ని తెచ్చింది పీవీ నరసింహారావు అని.

ముందు దేశం, ఆ తర్వాతే పార్టీ:

పీవీ ఏది చేసినా మొదటి ప్రాధాన్యత దేశ అభ్యున్నతికే ఇచ్చారు. ఆ తర్వాతే పార్టీ అన్నారు. అదే కాంగ్రెస్ వారికి మంటపుట్టించింది. ముఖ్యంగా సోనియా గాంధీకి. ప్రతి విషయం తనకు చెప్పే చేయాలని ఆమె, తెలియని విషయాలు చెప్పి ప్రయోజనం ఏంటి అన్నట్టు ఈయన, మధ్యలో చెంచాగాళ్ళ ఎగదోపుడు మాటలు.... ఇవన్నీ కలిసి పీవీకి కాంగ్రెస్ లోనే శత్రువులను పెంచాయి. పార్టీకి దూరం చేశాయి. ఆ ద్వేషాలు, దూరాలు ఆయన చనిపోయేవరకూ తరగలేదు. పైగా ఆయనకు మరిన్ని అపవాదులు ఆపాదించారు. ఇక మీడియా అయితే పార్టీనే పట్టించుకోని ఆయనను మేమెందుకు పట్టించుకోవాలని అనుకుంది. ఆయన బ్రతికుండగానే చనిపోయారని వార్తలు రాసేదాకా నిర్లక్ష్యం చూపింది. చనిపోయిన తర్వాతా ఆయనపై ప్రతీకారం తీర్చుకునే నీచ స్థాయికి దిగజారింది కాంగ్రెస్.

పార్టీని పట్టించుకోకుండా ముందుకెళ్ళాడు కాబట్టే పీవీకి ఆ అవస్థ అనుకున్నాడేమో, మన మన్మోహన్ సింగ్ గారు పార్టీ చెప్పినట్టు నడుచుకుని అపఖ్యాతిని మూట కట్టుకున్నారు. ఆ రకంగా చూస్తే పీవీ అనుసరించిన పంథానే సరి. అలా చేయగల సత్తా ఒక తెలుగు బిడ్డకే సాధ్యమేమో!     

తెలంగాణ రాష్ట్ర పండుగగా పీవీ జయంతి :

పీవీ చనిపోయినప్పుడు జరిగినవన్నీ చూసి కాంగ్రెస్ ను ఈసడించుకోని తెలుగు వాడు ఉండడేమో. ఉంటె వాడు తెలుగువాడు కాదనుకోవాలి, ఇంకా చెప్పాలంటే చేసిన మేలు మరచి పోయే కృతఘ్నుడు అని అనుకోవాలి. వై ఎస్ ఆర్ సరే కాంగ్రెస్ మనిషి, కాని తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే కెసిఆర్ కు ఏమయ్యింది? అని అనుకున్నా ఆనాడు.
కానీ ఇప్పుడు పీవీ జయంతిని రాష్ట్ర పండుగగా చెయ్యడం, తెలంగాణ రాజకీయ రాజధాని వరంగల్ లో పీవీ విగ్రహాన్ని నెలకొల్పడం చూస్తుంటే 'వాహ్ ! కెసిఆర్' అనిపించింది. ఆలోచన ఆయనదైనా, మరెవరిదైనా అభినందించతగినది. ఆనందించతగినది. పీవీని గౌరవించడం అంటే తెలుగు జాతిని గౌరవించుకోవడం.