పేజీలు

7, ఆగస్టు 2018, మంగళవారం

చేనేతను మనసారా హత్తుకుందాం



భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన స్వదేశీ ఉద్యమం 1905, ఆగష్టు 7న ప్రారంభమైంది. విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి భారతీయులంతా స్వదేశీ వస్త్రాలను తమకు తామే తయారుచేసుకోవడం ప్రారంభించారు. ఆ రకంగా దేశ స్వాతంత్య్ర సమరానికి ఊపిరి... దేశ సంస్కృతికి ప్రతీకగా నూలు వడికే రాట్నం నిలిచింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగష్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 




తెలుగు రాష్ట్రాలలో చేనేత వస్త్రాల విషయానికి వస్తే... తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని పోచంపల్లి,  మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట్,  గద్వాల్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని  ధర్మవరం,  తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ,  నెల్లూరు జిల్లాలో ఉన్న వెంకటగిరి ప్రాంతాలలో నేసిన చీరెలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందుతున్నాయి.  ధర్మవరం పెళ్లి పట్టు చీరలు, పోచంపల్లి ఇకత్ ఫ్యాబ్రిక్,  వెంకటగిరి కాటన్ శారీస్,  రాజమాత చీరలు.. వేటికవే ప్రత్యేకం. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాధీ కళావైభవాన్ని ప్రశంసిస్తూ యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ ఓ వ్యాసం కూడా రాశారంటే తెలుగు వారి చేనేత వైభవం, నైపుణ్యం, ప్రాభవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  పొందూరు ధోవతితో పాటు   పుత్తూరు లుంగీ కూడా అంతే ప్రసిద్ధి.  

చాలా దేశాల్లో సుమారు 200 సంవత్సరాల క్రితమే చేనేత పరిశ్రమ అంతరించిపోయింది. అలాంటిది మన దేశంలో ఇంకా ఆ హస్తకళను సజీవంగా ఉంచుకున్నాం. ఎందుకంటే ఒక్క పద్మశాలీలే కాకుండా రెండు తెలుగురాష్ట్రాల్లో 18 ఉపకులాల వారు చేనేత వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు.  చీరాల, మంగళగిరి, పెడన, మచిలీపట్నం, వెంకటగిరి, మాధవరం, గద్వాల, సిద్దిపేట, సిరిసిల్ల.   పోచంపల్లి, నారాయణపేట మొదలైన ప్రాంతాలలో చేనేత పరిశ్రమ రాజకీయాలకు అర్థంకాని, ప్రభుత్వాలకు పట్టని ఒక జీవన వేదం.  పవర్ లూమ్స్, షటిల్ మగ్గాలు, స్పిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ మిల్లులు, ఎయిర్ జెట్ వంటి మగ్గాల రాకతో చేనేత బతుకు సమరం చేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన నేతన్నకో నూలుపోగు చందాన రాశానీ ఈ చిన్న కవిత. 

వెలుగు దారాలు వాకిట జారకముందే...  మగ్గం మీద వీరు 
చద్దిబువ్వ కడుపున పడక పోయినా... నడిచే యంత్రాలు వీరు

తరాల నుండీ అదే నేత...  గంటల కొద్దీ ఒకే చోట 
తరాలు మారినా అదే వెత... కష్టం తప్ప, లేదు వేరే ముచ్చట 

కుదించుకు పోతున్నా ఒంటి నరాలు... సాగుతూ అల్లుకుపోతాయి నూలు దారాలు
కుదేలవుతున్నా కుటుంబాలు...  బలంగా అద్దుకుంటాయి మెరిసే రంగులు 

కష్టాల అష్ట దిగ్బంధనంలో, తనకు తానే బందీ అయిన కండె తాను 
నెరవేరని తన స్వప్నాలను, కళాత్మకంగా వస్త్రంపై తీర్చిదిద్దే గడసరి కవి తాను 

రాజులను మెప్పించారు.. ప్రధానులను మెప్పించారు 
అయినా అదృష్ట దేవత మెప్పు పొందలేకపోయారు

వయసంతా మగ్గిపోతోంది మగ్గం పైనే 
మనసంతా మసకబారుతోంది తీరని బాధ్యతలతోనే 

నేతన్నా అని పిలవడం కాదు, తమ్ముళ్ళమై అన్నను ఆదుకుందాం 
వారంలో ఒకరోజు చేనేతను మనసారా హత్తుకుందాం



నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.  


         

5, ఫిబ్రవరి 2018, సోమవారం

అరకు కాఫీ... ఎవరికి దక్కేను?

అరకు ఆర్గానిక్ కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందంటే 'ఔనా!' అని ఆశ్చర్యపోయేవారే ఎక్కువ. ముఖ్యంగా మన తెలుగువాళ్ళు. అరకు కాఫీ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి అవుతుందన్న విషయం కార్పొరేట్ సంస్థల అధిపతులకు తెలిసినంతగా రోజూ కాఫీ తాగే సగటు తెలుగు కాఫీ ప్రేమికులకు తెలియదు. 

పారిస్ లో అరకు కాఫీ స్టోర్:  

  
మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా నిర్మాణ సంస్థ చైర్మన్ మాగంటి రాజేంద్రప్రసాద్ లు పారిస్ లో అరకు కాఫీ మొదటి స్టోర్ ప్రారంభం అయ్యేందుకు కారణమయ్యారు. ఎందుకంటే ఈ సంస్థల ఆధ్వర్యంలో  అరకు ప్రాంతంలో 20,000 ఎకరాలలో కాఫీ పంట సాగవుతోంది. ఈ సంస్థలే అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్ ను తెచ్చిపెట్టాయి.  ఐదు వేరియెంట్లలో అమ్ముడుపోయే  అరకు కాఫీ ధర పారిస్ లో కిలో రూ.7,000లు అంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతుంది కదా!
పారిస్ లో అరకు కాఫీ స్టోర్ 



బ్రిటీషోడు ముందే గుర్తించాడు...  

మన్నెం గిరిజనులకు ఉపాధి మార్గం చూపాలన్న ఆలోచనతో బ్రిటిష్‌ అధికారులు కాఫీ పంటను ప్రోత్సహించారు. మట్టి మహత్యమో, నీటి స్వభావమో తెలియదుకానీ తెల్లదొరలు ఆ రుచికి, కమ్మదనానికి ఫిదా అయిపోయారు. కాఫీ గింజల్ని మూటగట్టి ఓడలకు ఎక్కించారు. ఆ రోజుల్లో యూరప్‌లోని సంపన్న కుటుంబాలకు పొద్దున్నే కప్పు నిండా అరకు కాఫీని ఆస్వాదించడం ఓ  ఉత్తమాభిరుచి కింద లెక్క. కానీ ఆ తర్వాత పట్టించుకునే పాలకులు లేక చల్లారిపోయిన కాఫీలా అరకు పేరు మూలనపడిపోయింది. మళ్లీ ఇప్పుడు పునర్వైభవం మొదలైంది. 

చంద్రబాబుతో పునర్వైభవం: 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు, ‘నేను అరకు కాఫీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటాను’ అని స్వచ్ఛందంగా ప్రకటించారు.  2016 జనవరి నెలలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో అతిథులు, గవర్నర్, కేంద్రమంత్రులకు దగ్గరుండి మరీ అరకు కాఫీ రుచి చూపించారు. ఫిబ్రవరిలో జరిగిన ఐఎఫ్‌ఆర్‌లో ప్రధానికి కూడా కాఫీ రుచి  చూపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా వచ్చే అతిథులకు గిఫ్ట్ ప్యాక్‌గా అరకు కాఫీనే ఇవ్వడం మొదలు పెట్టారు. విశాఖ ఏజెన్సీలో పండుతున్న ‘అరబికా’ కాఫీ 2009-10 సంవత్సరం నుంచి వరుసగా ఐదుసార్లు ‘ఫైన్‌ కప్‌ ఆఫ్‌ కాఫీ’ అవార్డును సొంతం చేసుకుందంటే అరకు కాఫీ మహిమెంతో తెలుసుకోవచ్చు. 

జియో ట్యాగ్ కోసం టగ్ ఆఫ్ వార్: 

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. విశాఖ జిల్లా అరకు లోయలో పండే 'అరకు ఆర్గానిక్ కాఫీ' విషయమై భౌగోళిక విశిష్ట గుర్తింపు  (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ - GI) మాకు చెందాలంటే మాకు చెందాలని అటు కేంద్ర కాఫీ బోర్డు, ఇటు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ  (GCC) రచ్చకెక్కాయి. 
నిజానికి అరకు కాఫీకి జిఐ ఇవ్వాలంటూ 2016 ఏప్రిల్ లోనే చెన్నైలోని జిఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకుంది. ఇదే విషయమై 2018, జనవరి ఒకటో తేదీన కేంద్ర కాఫీ బోర్డు దరఖాస్తు చేసింది. ఈ అరకు కాఫీ ఒరిస్సాలో సైతం పండుతుండగా ఏపీ గిరిజన సహకార సమాఖ్యకు జిఐ ఎలా ఇస్తారంటూ కేంద్ర కాఫీ బోర్డు వాదిస్తోంది. 

''జిఐ ట్యాగ్ కోసం మేము ముందుగా దరఖాస్తు చేసుకున్నాం. దీనిపై తమ సిఫారసును అందచేయాలని జీఐ రిజిస్ట్రీ దరఖాస్తు ప్రతిపాదనను కాఫీ బోర్డుకు పంపించింది. మద్దతు పలకాల్సిన కాఫీ బోర్డు కాస్తా ప్లేటు ఫిరాయించి తానే  జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయడం విడ్డూరమని, తమ హక్కుల కోసం మేం న్యాయపోరాటం చేస్తాం. లాభాపేక్ష లేకుండా గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వ సహకార సంస్థ మాది.'' అని జీసీసీ అంటోంది. మరి ఈ అద్భుతమైన కాఫీపై గుర్తింపు ఎవరికి సొంతమవుతుందో రాబోయే రోజుల్లో తేలుతుంది. 


అరకు కాఫీనే అడగండి...   

ఇంతకూ నేను చెప్పొచ్చేదంటంటే... కాఫీ అనగానే బ్రు, నెస్కేఫె ప్యాకెట్ల కోసం వెదక్కుండా అరకు కాఫీ కావాలని బజార్లలో అడగండి. ఈ మద్యే అరకు కాఫీ ఇన్ స్టెంట్ ప్యాకెట్లను కూడా విడుదల చేశారు. అయితే మార్కెట్ మాయాజాలమో, ఇంకేదయినా కారణమో తెలీదుకానీ అరకు కాఫీ బజార్లలో దొరకడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రచారం లేదని చెప్పాలి. 





ఆకాశవీధిలో అరకు కాఫీ గుభాళింపులు:  

కాకపోతే ఈ మధ్యే ఈ దిశగా అడుగులేస్తోంది ఏపీ ప్రభుత్వం.  స్పైస్ జెట్ సంస్థతో టూరిజం శాఖ ఒక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం... ఏపీకి వెళ్ళే, ఏపీ నుంచి బయలుదేరే స్పైస్ జెట్ విమానాలలో అయితే ప్రయాణికులకు అరకు అందాల గురించి వివరిస్తారు. అదయ్యాక అందరికీ అరకు కాఫీని అందిస్తారు. కాఫీతో పాటు స్క్రాచ్ కార్డు కూడా ఇస్తారు. అలా ప్రయాణికుల నుంచి ఇద్దరిని ఎంపిక చేసి వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఆ ఇద్దరు విజేతలు తమ కుటుంబాలతో అరకు వెళ్ళి రెండు రాత్రులు, మూడు రోజులు ఉచితంగా బస చేయొచ్చు.