పేజీలు

28, జులై 2015, మంగళవారం

మహనీయ వ్యక్తిత్వాలు ఇలా రూపుదిద్దుకుంటాయి



అబ్దుల్ కలాం వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు. కానీ అందరూ తెలుసుకోవలసింది ఏంటంటే ఆ వ్యక్తిత్వాన్ని అలా చెక్కిన శిల్పులెవరూ అన్నది. కలాం గారు చెప్పిందే ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకుందాం. 
కలాం చిన్నతనంలో ఒకరోజు... 
కలాం వాళ్ళ అమ్మ ఓ రోజు రాత్రి ఇంట్లో అందరికీ రొట్టెలు చేసి పెట్టింది. అయితే పని ఒత్తిడిలో పడి  రొట్టెలు మాడిపోతున్న విషయం ఆమె గమనించలేదు. కూరతో సహా ఆ మాడిపోయిన రొట్టెలనే భర్తకు వడ్డించింది ఆమె. తండ్రి ఆ రొట్టెలను చూసి ఎలా స్పందిస్తాడో అని ఎదురుచూస్తున్నాడు బాల కలాం. కానీ తండ్రి ఏమీ మాట్లాడకుండా ఆ రొట్టెలను తింటూ, కలాంను పిలచి స్కూల్లో విశేషాలేంటి అని అడిగాడు. ఆ విశేషాలు ఏం చెప్పిందీ కలాంకు గుర్తులేదు కానీ... ఆ రాత్రి రొట్టెలను మాడ్చినందుకు తన తల్లి భర్తను క్షమాపణ అడిగిన విషయం, 'పిచ్చిదానా ! నాకసలు మాడిపోయిన రొట్టెలంటేనే ఇష్టం. నువ్వేం బాధపడకు' అంటూ తండ్రి అన్న మాటలు మాత్రం గుర్తుండి పోయాయి. 
ఆ తర్వాత తండ్రికి గుడ్ నైట్ చెప్పడానికి వెళ్ళిన కలాం, 'నీకు నిజంగానే మాడిపోయిన రొట్టెలు ఇష్టమా? అని తండ్రిని అడిగాడు. అప్పుడాయన కలాంను దగ్గరకు తీసుకుని 'మీ అమ్మ రోజంతా పనిచేసి చేసి అలసిపోయింది. దానివల్ల రొట్టె మాడిఉండొచ్చు. అయినా ఒకరోజు మాడిపోయిన రొట్టె తిన్నంత మాత్రాన ఏమీ అయిపోదు. రొట్టె మాడిందని కోపంతో ఏదైనా మాట్లాడితే దానివల్ల మీ అమ్మ మనసు గాయపడుతుంది కదా. దేనివల్ల ఎక్కువ నష్టం?' అని అడిగాడు. 
ఆ మాటలు అబ్దుల్ కలాం వ్యక్తిత్వం మీద చాలా ప్రభావాన్ని చూపించింది. మనం గమనించం గానీ రోజూ మన ఇళ్ళలో మనం మాట్లాడుకునే మాటలు పిల్లల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అబ్దుల్ కలాం గొప్పదనం గురించి మాట్లాడుకునే ముందు, ఆయన తండ్రి గొప్పదనాన్ని కూడా గుర్తించాలి. అదే సమయంలో మన ఇంట్లో ఉన్న బాల కలాం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో మన పాత్రను ఎలా పోషిస్తున్నామో ఆలోచించాలి.                    
           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి